మహిళలు గృహహింస కేసులు పెట్టడం చూస్తుంటాం. కానీ ఓ భర్త తన భార్యపై గృహహింస కేసు పెట్టడం రాజస్తాన్ లో హాట్ టాపిగ్గా మారింది. సీసీటీవీ పుటేజీలతో సహా సదరు భర్త పోలీసులను ఆశ్రయించాడు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. భార్య తన భర్తను ఎంత దారుణంగా కొట్టిందంటే…తప్పించుకునేందుకు అతను అటుఇటు పరుగులు తీశాడు. పూర్తివివరాల్లోకి వెళ్తే…అల్వార్ లోని భివాడికి చెందిన స్కూల్ ప్రిన్సిపాల్ అజిత్ యాదవ్ కు 9 ఏండ్ల క్రితం సుమన్ అనే మహిళతో వివాహం జరిగింది. పెళ్లి అయినప్పటి నుంచి తరచూ భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతుండేవి. అయితే తన భార్యపై అజిత్ ఏనాడూ తిరగబడలేదు.
భర్త మంచితనాన్ని అలుసుగా తీసుకున్న అతని భార్య…తరచుగా అతనితో గొడవపడేది. ఈ క్రమంలో అతన్ని కొట్టడం కూడా ప్రారంభించింది. భార్య తీరుతో విసుగిపోయిన అజిత్…ఆమె నిజస్వరూపాన్ని బయటపెట్టేందుకు సీసీ కెమెరాను అమర్చాడు. తనభార్య తనపై చేసిన దాడి సీసీఫుటేజీలను తీసుకుని పోలీస్ స్టేషన్ వచ్చి బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టు బాధితుడికి భద్రత కల్పించాలని ఆదేశించింది. కన్నకొడుకు ముందు భర్తతో దాడిచేయడం గమనార్హం. తండ్రిని చితక్కొడుతుంటే…ఆ బాలుడు భయపడటం వీడియోలో స్పష్టం కనిపిస్తోంది.