సల్మాన్ ఖాన్ హీరోగా, షారుక్ ఖాన్ అతిథి పాత్రలో నటిస్తున్న ‘టైగర్ 3’ (Tiger 3) మూవీ రిలీజ్ కోసం అభిమానులు ఎంతో ఆతురతగా ఎదురు చూస్తున్నారు. ఈ టైంలో స్వయంగా సల్లూ భాయ్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లోని అబుధాబిలో ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ ప్రెస్ కాన్ఫరెన్స్లో దీనిపై సల్మాన్ ప్రకటన చేశారు. షూటింగ్ విశేషాలను వివరించారు. ‘దీపావళికి మీరు టైగర్ 3ని చూస్తారు’ అని వెల్లడించారు. కత్రినా కైఫ్, ఇమ్రాన్ హష్మీ, అలనాటి అందాల తార రేవతి కీలక పాత్రలలో నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ పూర్తయిందని చెప్పారు. మే 24వ తేదీ రాత్రి వరకు షూటింగ్ జరిగిందని.. చివరి సీన్ చేసి ముంబై నుంచి అబుధాబికి బయలుదేరి వచ్చానన్నారు. నవంబర్ 12న దీపావళి రోజున అభిమానులు ‘టైగర్ 3’ (Tiger 3) చిత్రాన్ని సినిమా హాల్ లో చూస్తారని సల్లూ భాయ్ తెలిపారు.
Also read : Salman Khan Business : సల్లూ భాయ్ న్యూ బిజినెస్.. ఏమిటది?
టైగర్ 3 స్టోరీ ఇదీ..
IFFA అవార్డ్స్ ప్రదానోత్సవ కార్యక్రమం ఈరోజు (మే 26న) అబుధాబిలో జరగనుంది. దీనికి హాజరైన సల్మాన్ ఖాన్ విలేకరులకు ఈ వివరాలను వెల్లడించారు. ‘టైగర్ 3’ మూవీకి మనీష్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ‘ఏక్ థా టైగర్’, ‘టైగర్ జిందా హై’ తర్వాత సూపర్ హిట్ టైగర్ ఫ్రాంచైజీలో ఈ సినిమా రూపొందుతోంది. స్పై యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ‘టైగర్ 3’ చిత్రంలో సల్మాన్ ఖాన్ను కమాండ్ చేసే రా ఆఫీసర్ పాత్రలో రేవతి కనిపించనుందని ఇన్సైడ్ టాక్. ఈ సినిమాలో వీరందరితో పాటు అశుతోష్ రాణా, అనుప్రియా గోయెంకా, రిద్ధి డోగ్రా, అంగద్ బేడి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ కోసం షారుఖ్ తన జుట్టును పొడవుగా పెంచారని అంటున్నారు. ‘టైగర్ 3’ కి ముందు.. సల్మాన్, SRK కలిసి సిద్ధార్థ్ ఆనంద్ బ్లాక్ బస్టర్ మూవీ పఠాన్లో కలిసి కనిపించారు.