పద్మశ్రీ అవార్డు గ్రహీత, వనప్రియుడు రామయ్య ( Vanajeevi Ramaiah) (85) శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామయ్య ఇంట్లో స్పృహ కోల్పోవడంతో కుటుంబ సభ్యులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతుండగానే ఆయన మృతి ( Vanajeevi Ramaiah Dies) చెందారు. కోటి మొక్కలకు పైగా నాటి, ప్రకృతి పరిరక్షణకు జీవితాన్ని అంకితమిచ్చిన వనజీవి రామయ్య మరణంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదం నెలకొంది.
US Egg Crisis: ట్రంప్ ఇలాకాలో గుడ్ల గోల.. కోడిగుడ్డు కోసం అమెరికన్ల పాట్లు
వనజీవి రామయ్య మరణం పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu) ఆయన సేవలు ప్రశంసిస్తూ, “కోటి మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించిన రామయ్య, ఎన్నో తరాలకు స్ఫూర్తిగా నిలుస్తారు” అని పేర్కొన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా రామయ్య మరణంపై విచారం వ్యక్తం చేస్తూ, “వనజీవి అనే పేరును తన ఇంటిపేరుగా మార్చుకున్న పర్యావరణ హితుడు” అని కొనియాడారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఆయన సేవలను స్మరిస్తూ నివాళులర్పించారు.
వనజీవి రామయ్య అసలు పేరు దరిపల్లి రామయ్య. ఖమ్మం జిల్లా రెడ్డిపల్లికి చెందిన ఆయన చిన్ననాటి నుంచే మొక్కలపై ప్రేమను పెంచుకున్నారు. 50 ఏళ్ల పాటు విత్తనాలు చల్లి, కోటి మొక్కలు నాటి, ప్రకృతి పరిరక్షణలో స్ఫూర్తిదాయక మార్గదర్శకుడిగా నిలిచారు. 2018లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో రామయ్య సేవలను గౌరవించింది. మహారాష్ట్ర రాష్ట్ర పాఠ్యాంశాల్లో ఆయన జీవితం చేర్చగా, తెలంగాణలో కూడా పిల్లలకు రామయ్య కథను బోధిస్తున్నారు. రామయ్య మృతి ప్రకృతి ప్రేమికుల మనసుల్లో తీరని శూన్యతను కలిగించింది. ఆయన సేవలను గుర్తిస్తూ ప్రజలు భారీగా రెడ్డిపల్లిలోని ఆయన ఇంటికి చేరుకుంటున్నారు.