పల్లె ప్రజలకు జానపదులు అంటే ఇష్టం. వారు ఎక్కువుగా జానపదం పాటలే పాడుతుంటారు. భారతదేశంలో జానపద కొన్ని శతాబ్ధాల నుంచి ప్రత్యేక స్థానముంది. ఈ జానపద సంగీతం గ్రామీణ పల్లె ప్రజల హృదయాల్లో నుంచి అప్పటికప్పుడు పుట్టిన స్వేచ్ఛ గీతం. దీనికి నియమ నిబంధనలు అంటే ఏమీ లేవు. ఇది ఎవరైనా పాడవచ్చు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో ఆధునిక శాస్త్రీయ సంగీతం అభివృద్ధి చెందిన రోజుల్లో వ్యవసాయం లాంటి శారీరక శ్రమ చేసే రైతుల కుటుంబాలు తమ శ్రమలో ఉపశమనం పొందేందుకు రకరకాలుగా జానపద పాటలు పాడేవారు. పొలం గట్లుపైన, నాట్లే వేసే సమయంలోనూ, పంట నూర్చే సమయంలో, కోత కోసే సమయంలో అప్పటికప్పుడు పదాలను అల్లి పాట రూపంలో పాడేవారు. ఇప్పుడు వచ్చే ఎటువంటి అర్థం పర్థం లేని పాటల్లా కాకుండా, ఒక లయబద్ధంగా జానపద పాటలు ఉండేవి. ఈ పాటల లక్ష్యం కేవలం వినోదం, ఉల్లాసం అందించడమే కాదు సాటి మనిషిలో మానవీయ కోణాన్ని, సంస్కారాన్ని ప్రతభను కనపర్చేది.
మార్మోగిన కిన్నెర
టాలీవుడ్ లో జనపదాల హోరు వినిపిస్తోంది. చిన్న చిన్న సినిమాలకే కాకుండా.. పెద్ద సినిమాలు సైతం జనపదం జపం చేస్తున్నాయి. ఇప్పటికే రాములోరాములా.. సారంగదరియా.. లాంటి పాటలు మంచి హిట్ అయ్యాయి. పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘భీమ్లానాయక్‘ మూవీలో టైటిల్ సాంగ్ ఎంత హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా నల్లమల ప్రాంతానికి చెందిన కిన్నెర వాద్య కళాకారుడు దర్శనం మొగులయ్య పేరు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా మార్మోగిపోతోంది. పవన్ కళ్యాన్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్ సాంగ్ పాడే అవకాశం దక్కించుకున్నాడు. ఆ పాటను యూట్యూబ్లో విడుదల చేయగా 10 గంటల్లో 6 లక్షల మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది.
మట్టిపాటకు గుర్తింపు
తాజాగా ‘భీమ్లానాయక్’ అడవి తల్లి మాట అనే లిరికల్ వీడియో సాంగ్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ‘అడవి తల్లి మాట’ పాటకు థమన్ అదిరిపోయే ట్యూన్ ను సమకూర్చడు. ఈ పాట కు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం ని అందించాడు. ఈ పాట ని జానపద గాయని కుమ్మరి దుర్గవ్వ మరియు సాహితీ చాగంటి కలిసి ఆలపించారు. ముఖ్యంగా దుర్గవ్వ పాటకు ప్రతిఒక్కరూ పిధా అవుతున్నారు. దుర్గవ్వకు చిన్నప్పట్నుంచే జనపదాలు అంటే చాలా ఇష్టం. గతంలో ఈమె పాడిన ‘టుంగూరమే’ అనే పాట అందర్ని ఆకట్టుకోవడంతో.. భీమ్లానాయక్ లో పాడే అవకాశం వచ్చింది. ఈమె తెలుగు పాటలే కాకుండా మరాఠీ పాటలు కూడా పాడుతోంది.