Tata Group – Haldirams : ఉప్పు నుంచి స్టీల్ దాకా.. కార్ల నుంచి విమానాల దాకా ప్రతి బిజినెస్ లో ఉన్న టాటా గ్రూప్.. మరో కొత్త వ్యాపారంలోకి రాబోతోంది. స్నాక్స్ బిజినెస్ లోకి టాటా గ్రూప్ అడుగు పెట్టబోతోంది. దేశంలోనే ప్రఖ్యాత స్నాక్స్ బ్రాండ్ ‘హల్దీరామ్స్’లో 51 శాతం వాటా కొనేందుకు టాటా గ్రూపు రెడీ అవుతోంది. ఈ దిశగా టాటా గ్రూప్ కన్స్యూమర్ ప్రోడక్ట్స్ విభాగం ప్రయత్నాలు చేస్తోంది. ఈ డీల్ విలువ దాదాపు రూ. 83 వేల కోట్లు ఉంటుందని తెలుస్తోంది. ఒకవేళ ఈ డీల్ ఓకే అయితే.. భారత మార్కెట్లో పెప్సీ, రిలయన్స్ రిటైల్లకు పోటీగా టాటా కన్స్యూమర్ ప్రోడక్ట్స్ అవతరిస్తుంది.
బ్రిటన్ కు చెందిన టీ బ్రాండ్ టెట్లీ, స్టార్బక్స్ ఇండియాతో ఇప్పటికే టాటా కన్స్యూమర్ ప్రోడక్ట్స్ కు (Tata Group – Haldirams) పార్ట్నర్ షిప్ ఉంది. ఈనేపథ్యంలోనే హల్దీరామ్స్లో 51 శాతం కంటే ఎక్కువ వాటాను సొంతం చేసుకునే యత్నాల్లో టాటా గ్రూప్ ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. 1937లో ఒక చిన్న దుకాణంలో హల్దీరామ్స్ బ్రాండ్ మొదలైంది. ఇప్పుడు మన దేశంలోని స్నాక్స్ మార్కెట్లో హల్దీరామ్స్ బ్రాండ్ కు 13 శాతం వాటా ఉంది.