Union Minister Bandi Sanjay : కేంద్ర మంత్రి బండి సంజయ్ ఏబీవీపీ నాయకులపై పోలీసులు, బాసర ట్రిపుల్ ఐటీ సెక్యూరిటీ సిబ్బంది దాడి చేయడాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఖండించారు. ఈ మేరకు బండి సంజయ్ ఈరోజు ప్రత్రికా ప్రకటన విడుదల చేశారు. బాసర ట్రిపుల్లో పరిస్థితి రోజురోజుకూ దిగజారుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది? అని ప్రశ్నించారు. విద్యార్థులు చనిపోతున్నా పట్టించుకోరా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆత్మహత్య చేసుకున్న బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధినికి న్యాయం చేయాలని నిరసన చేస్తుంటే విచక్షణారహితంగా దాడి చేయించడం దుర్మర్గం అని మండిపడ్డారు. విద్యార్థుల పక్షాన ఆందోళన చేస్తున్న ఏబీవీపీ నాయకులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం హేయమైన చర్య అని అన్నారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆత్మహత్యకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని తెలిపారు. అరెస్ట్ చేసిన ఏబీవీపీ నాయకులను వెంటనే విడుదల చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. జాప్యం చేయకుండా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అన్నారు. అంతేకాక.. ట్రిపుల్ ఐటీ విద్యార్థి స్వాతి ప్రియ ఆత్మహత్యకు కారణాలపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. ఆత్మహత్య చేసుకున్న స్వాతిప్రియ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
Read Also: Edible Oils : ‘మలేషియా’ ఎఫెక్ట్.. వంట నూనెల ధరల మంట