Site icon HashtagU Telugu

75 Years Reunite : అక్క మహేంద్ర కౌర్, తమ్ముడు అబ్దుల్ అజీజ్‌..75ఏళ్ళ తర్వాత కలిశారు

75 Years Reunite

75 Years Reunite

అక్క పేరు మహేంద్ర కౌర్.. తమ్ముడి పేరు షేక్ అబ్దుల్ అజీజ్‌!!

వీరిద్దరూ 75 ఏళ్ళ కింద విడిపోయారు..  విడిపోయిన టైంలో తమ్ముడు అజీజ్‌ వయసు మూడేళ్లు. అక్క మహేంద్ర కౌర్ వయసు ఆరేళ్ళు !!

ఇప్పుడు 81 ఏళ్ల వయసులో మహేంద్ర కౌర్, 78 ఏళ్ల వయసులో షేక్ అబ్దుల్ అజీజ్‌ మళ్ళీ కలుసుకున్నారు(75 Years Reunite) .. 

ఈ ఎమోషనల్ ఘట్టానికి పాకిస్తాన్ లోని కర్తార్‌పూర్‌లో ఉన్న గురుద్వారా దర్బార్ సాహిబ్‌ వేదికగా నిలిచింది.  

ఇద్దరూ ఒకరి మొహాన్ని ఒకరు చూసుకుంటూ .. ఎమోషనల్ అయిపోయి కన్నీళ్లు పెట్టుకున్నారు.

చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకొని వెక్కివెక్కి ఏడ్చారు. ఈ దృశ్యం మానవ సంబంధాలు .. ప్రత్యేకించి రక్త సంబంధాల విలువను మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది.

75 ఏళ్ల క్రితం అంటే 1947 సంవత్సరంలో మన ఇండియా విభజన జరిగింది. ఆ టైంలో పాకిస్తాన్ బార్డర్ లో పంజాబ్ , హర్యానా, కాశ్మీర్ లో పెద్దఎత్తున మతపరమైన  అల్లర్లు జరిగాయి .ఈ గొడవల్లో హిందూ, ముస్లిం, సిక్కు వర్గాలకు చెందిన లక్షలాది కుటుంబాలు ఇబ్బందిపడ్డాయి. చెల్లాచెదురు అయ్యాయి. పాక్ వైపు నుంచి ఇండియాలోకి వలస వచ్చే వాళ్ళు.. ఇండియా వైపు నుంచి పాక్ కు వలస వెళ్లే వాళ్ళను అల్లరి మూకలు టార్గెట్ గా ఎంచుకున్నారు. ఈవిధంగా ప్రభావితమైన లక్షలాది కుటుంబాల్లో..  సర్దార్ భజన్ సింగ్ కుటుంబం ఒకటి. సర్దార్ భజన్ సింగ్ పిల్లలే మహేంద్ర కౌర్ , షేక్ అబ్దుల్ అజీజ్‌.

అబ్దుల్ అజీజ్‌ తప్పిపోయి..

దేశ విభజన గొడవల్లో అబ్దుల్ అజీజ్‌ తప్పిపోయాడు. మూడేళ్ల వయసున్న అతన్ని ఎవరో ముస్లిం వ్యక్తి అక్కున చేర్చుకొని.. తనతో పాటు  పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌కు తీసుకెళ్లి పెంచుకున్నాడు. ఆ మూడేళ్ళ బాలుడిది సిక్కు మతం అని తెలియక.. అబ్దుల్ అజీజ్‌ అని పేరు పెట్టాడు.  మరోవైపు అబ్దుల్ అజీజ్‌ అక్క మహేంద్ర కౌర్ తన తల్లిదండ్రులతోపాటు ఇండియాలోనే ఉండిపోయింది. దేశ విభజన సమయంలో అబ్దుల్ అజీజ్‌ అనే వ్యక్తి తన అక్క నుంచి విడిపోయాడు అంటూ సోషల్ మీడియాలో పెట్టిన  ఒక పోస్ట్ వీరిద్దరిని మళ్ళీ కలిపింది.  ఇద్దరూ కలుసుకోగానే(75 Years Reunite) ఆనందంతో పొంగిపోయిన  మహేంద్ర కౌర్ పదే పదే తన తమ్ముడిని కౌగిలించుకుని.. అతని చేతులను ముద్దాడింది. రెండు కుటుంబాలు కలిసి కర్తార్‌పూర్‌లోని గురుద్వారా దర్బార్ సాహిబ్‌ను దర్శించుకున్నారు. పక్కపక్కనే కూర్చుని భోజనం చేశారు. వారి కలయికకు చిహ్నంగా బహుమతులు కూడా ఇచ్చుకున్నారు.