పానీ పూరీ.. చాలామంది లొట్టలేసుకుంటూ తింటారు. ఎంతోమందికి అది హాట్ ఫెవరేట్. అటువంటి పానీ పూరీని ఒక దేశ రాజధాని నగరంలో నిషేధించారు. అదే..నేపాల్లోని ఖాట్మండు. ఖాట్మండు వ్యాలీ పరిధిలోని లలిత్పూర్ మెట్రోపాలిటన్ సిటీలో పానీ పూరీ అమ్మకాలను బ్యాన్ చేశారు. ఈమేరకు లలిత్పూర్ మెట్రోపాలిటన్ సిటీ అధికార యంత్రాంగం శనివారం ఆదేశాలు జారీ చేసింది. ఇంతకీ ఎందుకీ నిర్ణయం తీసుకున్నారో తెలుసా ? పానీ పూరి తయారీలో అత్యంత ప్రధానంగా వినియోగించేది పానీ(నీళ్లు). లలిత్పూర్ మెట్రోపాలిటన్ సిటీ పరిధిలోని తాగునీటి శాంపిళ్ళలో కలరా బ్యాక్టీరియా ఉందని గుర్తించారు. మరోవైపు ఖాట్మండు లోయలోని
లలిత్పూర్, చంద్రగిరి మున్సిపాలిటీ, బుధానీలకంఠ మున్సిపాలిటీలలో పదుల సంఖ్యలో కలరా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. నేపాల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఎపిడెమియాలజీ అండ్ డిసీజ్ కంట్రోల్ విభాగం డైరెక్టర్ చుమన్లాల్ డాష్ ఈవిషయాన్ని వెల్లడించారు. కలరా సోకిన వారు ప్రస్తుతం టేకులోని సుక్రరాజ్ ట్రాపికల్, ఇన్ఫెక్షియస్ డిసీజెస్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. కలరా లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించాలని ప్రజలకు సూచించారు. డయేరియా, కలరాతో పాటు ఇతర నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు వ్యాప్తి చెందే ముప్పు ఉందని పేర్కొన్నారు.