Paytm – RBI : వినియోగదారుల నుంచి ఫిబ్రవరి 29 తరువాత డిపాజిట్లను స్వీకరించకూడదంటూ తాజాగా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL)పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షలు విధించింది. దీంతో పేటీఎం ఖాతాదారుల పరిస్థితి ప్రశ్నార్ధకంగా మారింది. వాళ్ల డబ్బులు సేఫేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పేటీఎం నుంచి తీసుకున్న లోన్స్ తిరిగి చెల్లించాలా? వద్దా? అనే డౌట్స్ కూడా వస్తున్నాయి. ఈనేపథ్యంలో కథనమిది.
We’re now on WhatsApp. Click to Join
పేటీఎం ఫాస్టాగ్
పేటీఎం ఫాస్టాగ్లు ఫిబ్రవరి 29వ తేదీ తరువాత పనిచేయవు. కనుక పేటీఎం ఫాస్టాగ్ యూజర్లు వీలైనంత త్వరగా ఇతర ఫాస్టాగ్లను కొనుక్కోవడం బెటర్. వాస్తవానికి మన దేశంలో ఫాస్టాగ్ల జారీలో పేటీఎం మూడో ప్లేసులో ఉంది. గత ఏడాది పేటీఎం ఏకంగా 5.8 కోట్ల ఫాస్టాగ్ ట్రాన్సాక్షన్లను ప్రాసెస్ చేసింది. కానీ ఫిబ్రవరి 29 తరువాత పేటీఎం ఫాస్టాగ్(Paytm – RBI) పనిచేయదు. కనుక యూజర్లపై దాని ఎఫెక్టు కనిపించనుంది.
పేటీఎం వాలెట్
‘పేటీఎం వాలెట్’ అనేది పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై ఆధారపడి పనిచేస్తుంటుంది. ఫిబ్రవరి 29 వరకు మాత్రమే మీరు పేటీఎంలో డబ్బులను డిపాజిట్ చేయగలుగుతారు. ఆ తరువాత అలా చేయడం కుదరదు. ఒకవేళ మీకు డబ్బులు అవసరమైతే ఇప్పటివరకు పేటీఎంలో ఉన్న డబ్బులు మాత్రమే విత్డ్రా చేసుకోవడానికి వీలవుతుంది. ఖాతాదారులు కోరుకుంటే వారి పేటీఎం వాలెట్లోని డబ్బును ఎలాంటి అదనపు ఛార్జీలను కట్టకుండానే ఇతర బ్యాంకు ఖాతాల్లోకి వాటిని ట్రాన్స్ఫర్ చేయొచ్చు.
పేటీఎం సబ్ వాలెట్లు
ఫిబ్రవరి 29 తరువాత పేటీఎం ఖాతాదారులు ఆర్థిక లావాదేవీలు కానీ.. టాప్ అప్లు కానీ చేయలేరు. ప్రీపెయిడ్ సాధనాలు, ఫాస్టాగ్లను ఉపయోగించలేరు. మెట్రోల్లో ఉపయోగించే నేషనల్ కామన్ మొబిలిటీ కార్డులు (NCMC), ఫుడ్, ఫ్యూయెల్ కార్డులను కూడా వాడలేరు. పేటీఎం యూజర్లు తమ ఖాతాల్లోని నిధులను ఫిబ్రవరి 29 వరకు వాడుకోవచ్చు.
యూపీఐ పేమెంట్స్
పేటీఎం యూజర్లు ఫిబ్రవరి 29 వరకు యూపీఐ పేమెంట్స్ చేసుకోవచ్చు. కనుక వారిపై తక్షణ ప్రభావం ఏమీ ఉండదు. కానీ ఫిబ్రవరి 29 తరువాత పేటీఎం ద్వారా యూపీఐ పేమెంట్స్ చేయడానికి వీలుపడదు. కనుక ఇప్పటి నుంచే మరో ప్రత్యామ్నాయం ఎంచుకోవడం మంచిది. ఒకవేళ మీ యూపీఐ ఐడీ – ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ లాంటి ఇతర బ్యాంకులతో లింక్ అయ్యుంటే మీకు ఎలాంటి సమస్య ఏర్పడదు. కనుక నేరుగా ఎప్పటిలానే యూపీఐ పేమెంట్స్ చేసుకోవచ్చు.
పేటీఎం లోన్స్
తాజాగా ఆర్బీఐ విధించిన ఆంక్షల ఎఫెక్టు పేటీఎం అందించే లోన్స్పై పడదు. పేటీఎం మంజూరు చేసిన లోన్లను థర్డ్ పార్టీ లెండర్లు వసూలు చేస్తారు. కాబట్టి పేటీఎం ద్వారా తీసుకున్న లోన్స్ను కచ్చితంగా కట్టాల్సిందే.
స్టాక్ మార్కెట్స్, మ్యూచువల్ ఫండ్స్
ఇక పేటీఎం వేదికగా జరిగే స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్ సర్వీసులుపైనా ఆర్బీఐ ఆర్డర్స్ ఎఫెక్టు ఉండదు. ఈ సేవలన్నీ సెబీ నిబంధనలకు అనుగుణంగానే జరుగుతాయి. వినియోగదారులకు ఆందోళన అక్కర్లేదు.