Site icon HashtagU Telugu

Train fare hike: రైల్వే టికెట్‌ ఛార్జీల పెంపు.. జులై 1 నుంచి అమల్లోకి !

Railway ticket fare hike.. effective from July 1!

Railway ticket fare hike.. effective from July 1!

Train fare hike : దేశవ్యాప్తంగా రైలు ప్రయాణికులకు కీలక సమాచారం. రాబోయే జూలై 1వ తేదీ నుంచి ట్రైన్ టికెట్ ధరల్లో స్వల్ప పెంపు అమల్లోకి రానున్నట్లు రైల్వే వర్గాలు సంకేతాలు ఇచ్చాయి. ప్రత్యేకించి ఏసీ, నాన్‌ ఏసీ మెయిల్/ఎక్స్‌ప్రెస్‌ తరగతుల ప్రయాణికులకు ఇది ప్రభావం చూపనుంది. ఇన్నేళ్ల తర్వాత రైల్వే టికెట్ ధరల్లో సవరణ జరగడం గమనార్హం.

ధరల పెంపు వివరాలు ఇలా ఉన్నాయి:

నాన్‌ ఏసీ మెయిల్‌/ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌ టికెట్లకు: కిలోమీటర్‌ ప్రయాణానికి అదనంగా 1 పైసా చెల్లించాల్సి ఉంటుంది.
ఏసీ తరగతికి: కిలోమీటరుకు 2 పైసల చొప్పున పెరిగిన ధర అమలులోకి రానుంది.
ఈ మార్పులపై ఇంకా అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉన్నా, పలు ఆంగ్ల మీడియా వెబ్‌సైట్లలో ఇప్పటికే దీనిపై కథనాలు ప్రచురితమవుతున్నాయి. రైల్వే శాఖ కూడా అంతర్గతంగా ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

రైల్వే శాఖ చాలా ఏళ్లుగా టికెట్ ధరల్లో పెద్దగా మార్పులు చేయలేదు. ప్రస్తుతం పెరిగిన ఇంధన వ్యయాలు, నిర్వహణ ఖర్చులు, సబ్సిడీల ప్రభావం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వర్గాల సమాచారం. అయినప్పటికీ, సామాన్య ప్రజలపై భారం తగ్గించే దిశగా కొన్ని ప్రయాణ రకాలపై ఈ పెంపు వర్తించదని పేర్కొనడం ఊరటనిచ్చే విషయం.

ఎవరికి ఈ పెంపు వర్తించదు?

సబర్బన్‌ ప్రయాణికులకు: ఈ ధరల పెంపు వర్తించదు. నగర ప్రాంతాల్లో రోజూ ట్రైన్‌లో ప్రయాణించే వారిపై ప్రభావం ఉండదు.
500 కిలోమీటర్ల లోపు సెకండ్ క్లాస్ ప్రయాణాలకు: టికెట్ ధర పెంపు అమలులోకి రాదు.
నెలవారీ సీజన్‌ టికెట్లు: ప్రస్తుత ధరలే కొనసాగుతాయని సంబంధిత అధికారులు స్పష్టం చేశారు.

తత్కాల్ టికెట్ల విషయంలో మరో కీలక మార్పు:

తాజాగా రైల్వే శాఖ తీసుకున్న మరో ముఖ్యమైన నిర్ణయం ఆధార్‌ ఆధారిత అథంటికేషన్‌ ఉన్న ప్రయాణికులు తత్కాల్‌ టికెట్లు బుక్ చేసుకునే సౌకర్యం కల్పించారు. ఈ మార్పు కూడా జులై 1 నుంచి అమల్లోకి రానుంది. దీనివల్ల టికెట్ బుకింగ్‌లో ఉన్న మోసాల్ని తగ్గించడంతోపాటు, వేగంగా సేవలు అందించే అవకాశం ఉంటుంది. మొత్తం మీద, జూలై 1వ తేదీతో రైల్వే టికెట్ ధరలు కొద్దిగా పెరగనున్నా, సాధారణ ప్రయాణికులపై తక్కువ ప్రభావమే చూపేలా నిర్ణయాలు తీసుకోవడం గమనార్హం. ప్రభుత్వ అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. ప్రయాణికులు ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం మేలని సూచన.

Read Also: YS Jagan : సింగయ్య మృతి కేసు.. వైఎస్‌ జగన్‌కు నోటీసులు