Tomato – Green Chillies : ధరల మంట పుట్టించిన టమాటా దిగొచ్చింది. కారంతో చిర్రెక్కించిన పచ్చి మిర్చి రేటు డౌన్ అయింది. నెలన్నర క్రితం దాకా కిలోకు రూ.200 పలికిన టమాటా రేటు ఇప్పుడు కిలోకు రూ.15 చేరింది. దీని రేటు రిటైల్ మార్కెట్లలో రూ.20, మాల్స్లో రూ.25 దాకా ఉంది. గతంలో కిలోకు రూ.200 పలికిన ఇక పచ్చిమిర్చి ధర ఇప్పుడు కిలోకు రూ.25కి చేరింది. మార్కెట్లోకి టమాట, పచ్చిమిర్చి వెల్లువెత్తుతుండటంతో రేట్లు తగ్గిపోయాయి. దీంతో సామాన్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక వంకాయ కిలో రూ.18, బెండ రూ.23, బీర రూ.18, కాకర రూ.23, దొండ రూ.18, బీన్స్ రూ.35, కాలిఫ్లవర్ రూ.18, ఉల్లి రూ.21, క్యాబేజీ రూ.13, ఆలుగడ్డ రూ.21, కీర రూ.13 చొప్పున లభిస్తున్నాయి. ఈ రేట్లు కొన్ని జిల్లాల్లో కొంచెం అటూఇటుగా ఉన్నాయి.
తెలంగాణలోని రంగారెడ్డి, కరీంనగర్, నాగర్కర్నూల్, వనపర్తి, మెదక్, వరంగల్, నల్గొండ, సూర్యాపేట, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మహబూబ్నగర్, వికారాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో కూరగాయల సాగు పెద్దఎత్తున జరుగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్లోని మెహిదీపట్నం మార్కెట్కు రోజూ 80 క్వింటాళ్లు, ఎర్రగడ్డ మార్కెట్కు 110 క్వింటాళ్ల టమాటాలు వస్తున్నాయి. ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ మార్కెట్లకూ టమాటాల ఫ్లో (Tomato – Green Chillies) పెరిగింది.