మటన్ తినాలంటే చాలా మంది వెనుకడుగు వేస్తుంటారు. ఎందుకంటే ప్రస్తుతం మార్కెట్లో మటన్ రేట్లు మండిపోతున్నాయి. కేజీ మటన్ రూ.800 నుంచి రూ.1000 వరకు పలుకుతుంది. దీంతో చాలా మంది ప్రజలు చికెన్, ఫిష్ వైపు చూస్తున్నారు. కానీ అదే మటన్ కేజీ రూ.400 దొరికితే ఎలా ఉంటుంది. జనం ఎగబడి మరీ కొనేస్తారు కదా.. అవును మీరు విన్నది నిజనే అక్కడ మటన్ కేజీ నాలుగు వందల రూపాయలేనట.. ఎక్కడ అనుకుంటున్నారా..! సిద్ధిపేట జిల్లాలో కూడా అలాంటి ఘటన జరిగింది. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అక్బర్ పేట లో మాత్రం కిలో మటన్ రూ. 400కే అమ్ముతున్నారు. నెలరోజుల నుంచి ఇదే ధరకు అమ్ముతున్నారు. దీంతో విషయం చుట్టుపక్కల గ్రామాలకు తెలియడంతో మటన్ షాపులకు క్యూ కడుతున్నారు. నిన్న ఆదివారం, మహాలయ అమావాస్య కావడంతో అక్బర్ పేట రద్దీగా మారింది. దుబ్బాక, మిరుదొడ్డి, గజ్వేల్ , దోమకొండా, బీబీపేట, రామాయంపేట, చేగుంట, దౌల్తాబాద్ మండలాల భారీగా తరలివచ్చారు. సిద్దిపేట మెదక్ ప్రధాన రహదారి వాహనాలతో నిండింది. భూంపల్లి పోలీసులు మాంసం ప్రియులను కంట్రోల్ చేశారు. రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. తక్కువ ధరకు మటన్ వస్తుండటంతో కొనుగోలుదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.