Site icon HashtagU Telugu

PM Modi : పేదల సంక్షేమానికి కట్టుబడిన ఎన్‌డీఏ ప్రభుత్వం: ప్రధాని మోడీ

Modi Govt

Modi Govt

PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ గురువారం సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా, పేదల సంక్షేమమే తమ పాలనా విధానానికి ప్రాథమిక ఉద్దేశ్యమని స్పష్టం చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం గత 10 ఏళ్ల పాలనలో పేదల జీవితాల్లో మౌలిక మార్పులు తీసుకురావడంలో కట్టుబడి పని చేసిందని, ఈ దిశగా విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఎన్‌డీఏ తీసుకొచ్చిన పథకాలు ప్రజలకు గౌరవప్రదమైన జీవితం అందించడానికి దోహదపడుతున్నాయి. సమ్మిళిత అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ, ప్రతి ఒక్కరూ ఆర్థికంగా స్వయంసమృద్ధి సాధించే విధంగా కార్యక్రమాలను అమలు చేస్తున్నాం అని ఆయన వివరించారు.

Read Also: Bangalore : తొక్కిసలాట ఘటన.. మధ్యాహ్నం కర్ణాటక హైకోర్టులో విచారణ

ప్రధానమంత్రి ఉజ్వల యోజన, పీఎం ఆవాస్ యోజన, జన్‌ధన్ యోజన, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలను పేర్కొంటూ, ఇవి దేశంలోని కోట్లాదిమంది పేదలకు ఇంటి, శుద్ధమైన ఇంధనం, బ్యాంకింగ్ సౌకర్యాలు, ఆరోగ్య పరిరక్షణ వంటి ప్రాథమిక అవసరాలను అందించాయని తెలిపారు. గ్రామీణాభివృద్ధికి ముఖ్యమైన మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం గట్టి పట్టుదలతో పని చేస్తోందన్నారు. ఈ పథకాల వల్ల 25 కోట్ల మందికి పైగా పేదరికం నుండి బయటపడగలిగారు. ఇది దేశంలోని సామాజిక, ఆర్థిక మార్పులకు చిహ్నంగా నిలుస్తోంది అని మోడీ అభిప్రాయపడ్డారు.

ఇక, మోడీ సర్కార్ 3.0 ఏర్పడి వచ్చే జూన్ 9 నాటికి సంవత్సరం పూర్తవుతుంది. మొత్తం 11 ఏళ్లపాటు ప్రధాని పదవిలో కొనసాగుతున్న మోడీ, బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో సహచరులకు కొన్ని సూచనలు చేశారు. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని, వాటిని సాధించేందుకు కొత్త ఉత్సాహంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజల నమ్మకాన్ని మరింత బలపరిచే ధంగా ప్రభుత్వ విజయాలను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. మోడీ పునరుద్ఘాటించిన విధంగా, పేదల జీవితాల్లో అర్థవంతమైన మార్పు తెచ్చేందుకు ఎన్‌డీఏ ప్రభుత్వం సాగిస్తున్న ప్రయాణం కొనసాగనుందని స్పష్టం అయింది. అభివృద్ధి, న్యాయం, సమానత్వం పట్ల ప్రభుత్వం నిబద్ధంగా ఉందని ఆయన సందేశం ద్వారా ప్రజలకు స్పష్టమవుతోంది.

Read Also: Bengaluru Stampede : ఆ పని చేయకండి అంటూ ఓ తండ్రి ఆవేదన కన్నీరు పెట్టిస్తుంది