Mukesh Ambani – Death Threat : ముకేశ్ అంబానీకి డెత్ వార్నింగ్ ఇస్తూ తాజాగా మరో మెయిల్ వచ్చింది. శుక్రవారం రాత్రి వచ్చిన మెయిల్ను మర్చిపోకముందే.. ఇప్పుడు రెండో మెయిల్ రావడం కలకలం రేపింది. మొదటిసారి మెయిల్ పంపినప్పుడు రూ.20 కోట్లు డిమాండ్ చేసిన దుండగుడు.. ఈసారి మెయిల్లో ఏకంగా రూ.200 కోట్లు డిమాండ్ చేశాడు. మొదటిసారి పంపిన మెయిల్కు రెస్పాండ్ కాకపోవడం వల్ల రూ.20 కోట్లను రూ.200 కోట్లకు పెంచాల్సి వచ్చిందని ఈమెయిల్ వార్నింగ్లో దుండగుడు ప్రస్తావించాడు. అడిగినంత డబ్బును తమకు ఇవ్వకపోతే ముకేశ్ అంబానీని చంపడం ఖాయమని స్పష్టం చేశాడు. దీనిపైనా ముకేశ్ అంబానీ సెక్యూరిటీ ఇన్ఛార్జ్ స్థానిక పోలీసులకు మరోసారి ఫిర్యాదు చేశారు. ఈవిషయాన్ని ముకేశ్ అంబానీ సెక్యూరిటీ సిబ్బంది, స్థానిక పోలీసులూ తీవ్రంగా పరిగణిస్తున్నారు. మెయిల్ పంపిన వ్యక్తిపై ముంబైలోని గందేవి పోలీస్ స్టేషన్లో ఐపీసీ సెక్షన్స్ 387, 506(2) ప్రకారం కేసు నమోదు చేశారు.దానిపై విచారణ జరుపుతున్న క్రమంలో మరో మెయిల్ రావడం గమనార్హం. శుక్రవారం రోజు(అక్టోబరు 27న) తొలిసారి దుండగుడు పంపిన వార్నింగ్ ఈమెయిల్లో.. ‘‘మా దగ్గర మంచి షూటర్లు ఉన్నారు. రూ.20 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తాం’’ అని ప్రస్తావించారు.
We’re now on WhatsApp. Click to Join.
- గత సంవత్సరం కూడా ముకేశ్ అంబానీ కుటుంబానికి ఇలాంటి బెదిరింపులు వచ్చాయి.
- 2022 ఆగస్టు 15న ఓ వ్యక్తి రిలయన్స్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న హర్ కిసాన్ దాస్ ఆసుపత్రికి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆసుపత్రిని పేల్చేస్తామని, అంబానీ కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు.
- 2021లో అంబానీ నివాసం ఆంటీలియా సమీపంలో పేలుడు పదార్థాలతో కూడిన ఓ స్కార్పియో కారును నిలిపి ఉంచడం కలకలం సృష్టించింది. ఈ ఘటన జరిగిన వారం రోజులకే స్కార్పియో యజమాని మన్సుఖ్ హీరేన్ అనుమానాస్పద రీతిలో చనిపోయాడు.
- ఈ కేసులను తొలుత ఇన్స్పెక్టర్ సచిన్ వాజే దర్యాప్తు చేపట్టగా.. తర్వాత ఆయనే ప్రధాన సూత్రధారిగా తేలడం గమనార్హం. దీంతో ఎన్ఐఏ అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు.
- ఈ ఘటన తర్వాత నుంచి ముకేశ్ అంబానీ, ఆయన కుటుంబ సభ్యులకు కేంద్ర ప్రభుత్వమే భద్రత(Mukesh Ambani – Death Threat) కల్పిస్తోంది.