Seethakka: రాష్ట్రపతి నిలబడితే.. మోడీ కూర్చుంటారా?.. ప్రధాని తీరుపై సీత‌క్క‌ విమర్శ

  • Written By:
  • Publish Date - April 1, 2024 / 12:57 PM IST

 

Danasari Seethakka: బీజేపీ అగ్రనేత, మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ(LK Advani)కి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న(Bharat Ratna)ను ప్రదానం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu) ఆదివారం స్వయంగా అద్వానీ ఇంటికి వెళ్లి అవార్డును అందజేసిన విష‌యం తెలిసిందే. వయోభారం, అనారోగ్య కారణాలతో అద్వానీ శనివారం రాష్ట్రపతి భవన్‌లో జ‌రిగిన‌ అవార్డుల ప్రదానోత్సవానికి హాజరు కాలేదు. దీంతో రాష్ట్రపతే స్వయంగా అద్వానీ ఇంటికి వెళ్లి ఆయనకు పురస్కారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి జ‌గ‌దీప్ ధన్‌ఖడ్‌, ప్రధాని మోడీ(Prime Minister Modi), ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, హోం మంత్రి అమిత్‌ షా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో పాటు అద్వానీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

 

అయితే, అద్వానీకి భారతరత్న పురస్కారం ప్రదానం సందర్భంగా తీసిన‌ ఒక ఫొటోపై మంత్రి సీత‌క్క ఎక్స్ (ట్విట‌ర్‌) వేదిక‌గా విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆ ఫొటోలో ప్రధాని మోడీ, అద్వానీ కుర్చీలపై కూర్చొని ఉండగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిలబడి ఉన్నారు. ఈ ఫొటోపై సీత‌క్క స్పందిస్తూ.. “భార‌త‌దేశంలో నియంత పాల‌న‌కు ఈ ఫొటో చ‌క్క‌టి ఉదాహ‌ర‌ణ‌. ఓ ఆదివాసీ మహిళకు జ‌రిగిన ఈ ఘోర అవ‌మానాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను” అని అన్నారు.

Read Also: Kejriwal : 14 రోజుల జ్యుడిషయల్‌ కస్టడీ.. తీహార్‌ జైలుకు కేజ్రీవాల్‌

ఇక ఇదే విష‌య‌మై ఇప్ప‌టికే తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ కూడా స్పందిస్తూ.. ‘ప్రధాని మోడీ గారు.. ఆదివాసీ అంటే చులకనా? రాష్ట్రపతి పదవి అంటే చులకనా? లేక ప్రజాస్వామ్యం అంటేనే చులకనా?’ అని ఎక్స్‌లో ప్రశ్నించింది. కాగా, వయోభారం వల్ల అద్వానీ కూర్చోవచ్చుగానీ.. రాష్ట్రపతి నిల్చున్నప్పుడు ప్రధాని మోడీ కూర్చోవడమేమిటని ఇప్ప‌టికే పలువురు సోష‌ల్ మీడియా ద్వారా విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.