Site icon HashtagU Telugu

Maoist : మంత్రి సీతక్కకు మావోయిస్టుల హెచ్చరికల లేఖ..!

Minister Seethakka

Minister Seethakka

Maoist : తెలంగాణ రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ (సీతక్క)కు మావోయిస్టుల పేరిట ఒక హెచ్చరికల లేఖ వైరల్ అవుతోంది. ములుగు ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీలపై జరుగుతున్న అన్యాయాలపై మంత్రి సీతక్క మౌనం పాటిస్తున్నారన్న విమర్శలతో ఈ లేఖ సంచలనం రేపుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీలపై వివక్ష చూపుతుంటే, గిరిజనుల నేతగా ఉన్న మంత్రి మాత్రం స్పందించకపోవడం పట్ల మావోయిస్టులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖలో ముఖ్యంగా ములుగు, కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాల్లో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు, అధికారులు తీసుకుంటున్న ఆంక్షలు, అటవీ శాఖ దాడుల గురించి వివరంగా రాశారు. 339 ఆదివాసీ గ్రామాలను ఖాళీ చేయాలని ప్రభుత్వం చూస్తోంది. ఇది జంతువుల కోసమా లేక కార్పొరేట్ సంస్థల కోసమా? అని లేఖలో ఘాటుగా ప్రశ్నించారు. జీవో నెంబర్ 49ను ప్రస్తావిస్తూ, ఈ జీవో ద్వారా గిరిజనులు తమ పూర్వీకుల భూములను కోల్పోతున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

 

మావోయిస్టుల లేఖలో పలు రాజకీయ ఆరోపణలు కూడా కనిపిస్తున్నాయి. కేంద్ర నేతలు మోడీ, అమిత్ షా మానసపుత్రులైన అంబానీ, అదానీల కోసమే ఈ విధ్వంసకర చర్యలు కొనసాగుతున్నాయని, ఆదివాసీల హక్కులను కాలరాసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. పేసా చట్టం, 1/70 చట్టం వంటి గిరిజన హక్కులను కాపాడే చట్టాలను సీతక్క ఎందుకు పట్టించుకోవడం లేదన్నది మరో కీలక ప్రశ్నగా లేఖలో వినిపించింది. ఈ లేఖపై మంత్రి సీతక్క స్పందిస్తూ, మావోయిస్టుల లేఖ నిజమైనదా కాదా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. అయితే, ఈ లేఖను ఆసరాగా చేసుకుని కొన్ని మీడియా సంస్థలు, రాజకీయ పార్టీలు అసత్య ప్రచారాలు చేస్తున్నారు అని పేర్కొన్నారు. కొంతమంది తనపై దుష్ప్రచారం చేస్తూ, అసభ్య పదజాలాన్ని ఉపయోగించి తన గిరిజన మహిళ అనేది కూడా పట్టించుకోకుండా రాజకీయ ప్రయోజనాల కోసం విమర్శలు చేస్తుండడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు.

ఒక కోయ మహిళకు జనరల్ పోర్ట్‌ఫోలియో రావడం కొందరికి జీర్ణించలేకపోతుంది. ఎన్నికల సమయంలో నన్ను ఓడించేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరిగాయి. ఇప్పుడు మళ్లీ నన్ను లక్ష్యంగా చేసుకుంటున్నారు అని మంత్రి సీతక్క తెలిపారు. అంతేగాక, గిరిజనుల ప్రయోజనాల కోసం తాను ఎప్పుడూ పోరాడుతానని, అవసరమైతే జీవో 49పై తన అభిప్రాయాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తానని హామీ ఇచ్చారు. మావోయిస్టుల లేఖ నిజమేనో, రాజకీయ కుట్రలో భాగమో అనే అనుమానాల నడుమ ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో గిరిజనుల భద్రత, హక్కులు మరోసారి దృష్టిలోకి వచ్చిన ఈ సందర్భంలో, ప్రభుత్వ స్పందన కీలకం కానుంది.

Read Also: Jagannath Rath Yatra : జ‌గ‌న్నాథ ర‌థ‌యాత్ర‌లో అప‌శ్రుతి