Mango Business: ఆంధ్రా.. ఆమ్.. అచ్చేదిన్.. టన్ను రూ.1.50 లక్షలకు ?

ఆంధ్రా మామిడి రైతుకు మళ్లీ మంచిరోజులు వచ్చాయి. అన్ని రకాల మామిడి రకాలకు గిరాకీ వెల్లువెత్తుతోంది.

  • Written By:
  • Publish Date - May 2, 2022 / 05:30 PM IST

ఆంధ్రా మామిడి రైతుకు మళ్లీ మంచిరోజులు వచ్చాయి. అన్ని రకాల మామిడి రకాలకు గిరాకీ వెల్లువెత్తుతోంది. విజయవాడలో ఉన్న ఆసియాలోనే అతిపెద్ద ‘ నున్న’ మామిడి మార్కెట్‌ వ్యాపారులతో కళకళలాడుతోంది. ప్రస్తుతం నూజివీడు, విస్సన్నపేట, మైలవరం, జి.కొండూరు, రెడ్డిగూడెం, మైలవరం, తెలంగాణలోని కల్లూరు ప్రాంతాల నుంచి మామిడి పండ్లు వెల్లువలా వస్తున్నాయి. ఏప్రిల్‌ రెండో వారం నుంచి ఎగుమతులు ఊపందుకున్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యాపారులు, స్థానిక వ్యాపారులు రైతుల నుంచి మామిడి పండ్లను కొనుగోలు చేసి ఢిల్లీ, రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్, లక్నో, కోల్‌కతా తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. రోజుకు 300 నుంచి 400 టన్నుల పండ్లు దేశంలోని వివిధ మార్కెట్లకు ఇక్కడి నుంచి వెళ్తున్నాయి. ఇప్పటివరకు నున్న మార్కెట్‌ నుంచి 2 వేల టన్నులకు పైగా కాయలు వివిధ రాష్ట్రాలకు ఎగుమతి అయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం టన్ను మామిడిపండ్ల ధర రూ.55 వేల వరకు పలుకుతోంది. గత ఏడాది మార్చి నెలాఖరులో బంగినపల్లి టన్ను ధర రూ.30–35వేలు ఉండగా, ఈ ఏడాది రూ.70–80 వేల వరకు పలుకుతుందని ఆశిస్తున్నారు. మార్కెట్లో దాని లభ్యత తక్కువగా ఉంటే.. ఒక టన్నుకు రూ.1.50 లక్షలు పలికినా ఆశ్చర్యం లేదనే అంచనాలు వెలువడుతున్నాయి. ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రసాలకు మంచి గిరాకీ ఉంది. కాయలు పక్వానికి రావడంతో తోటల్లోనే కాయ రూ.15– రూ.20 వరకు అమ్ముతున్నారు. పెద్ద రసాలు ఒక్కో కాయ రూ.25నుంచి రూ.30 పలుకుతోంది. సరుకు పూర్తి గా మార్కెట్‌లోకి వస్తే కొంత మేర ధరలు అందుబాటులోకి వస్తాయని వ్యాపారులు భావిస్తున్నారు.

దిగుబడి తగ్గడంతో..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8.41 లక్షల ఎకరాల్లో మామిడి సాగవుతోంది. ఫిబ్రవరిలోనే మామిడి ఎగుమతులు తోటల నుంచి ఎగుమతులు నామమాత్రంగా ప్రారంభమైనప్పటికీ.. నున్న మార్కెట్‌ నుంచి మాత్రం మార్చి 20 నుంచే మొదలయ్యాయి. ఏప్రిల్‌ రెండో వారం నుంచి ఎగుమతులు ఊపందుకున్నాయి. వాస్తవానికి ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా మారడంతో పూత ఆలస్యంగా వచ్చింది. జనవరిలో కొంత పూత వచ్చినప్పటికీ వైరస్‌ బారిన పడటంతో పిందె కట్టకుండానే రాలిపోయింది. గతంలో ఎకరానికి 4–5 టన్నుల దిగుబడి రాగా.. ప్రస్తుతం సగానికి సగం (2 – 2.5 టన్నులు) తగ్గిపోయే పరిస్థితి ఉందని రైతులు చెబుతున్నారు. ఈ ఏడాది ధరలు ఆశాజనకంగా ఉండటంతో ఊరట లభిస్తుందంటున్నారు. కోవిడ్ ఉధృతి ఎక్కువగా ఉన్న 2020, 2021 సీజన్లలో మామిడి ధరలు బాగా తగ్గాయి. 2021 మార్చి నెలాఖరులో బంగినపల్లి టన్ను ధర రూ.30–35వేలే పలికింది. గతంలో ధరలు ఇంకా తగ్గిపోతాయేమోననే భయంతో రైతులు తొందరపడి పక్వానికి రాని కాయల్ని కోసేవారు. ఈ ఏడాది రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఉద్యానవన శాఖ అధికారులు అంటున్నారు. ఈసారి దిగుబడులు తగ్గడంతో సరుకు లభ్యత తక్కువగా ఉంది. అందువల్ల రైతులు కాయలు పక్వానికి వచ్చాకే కోస్తే వాటి బరువు పెరుగుతుందని సూచిస్తున్నారు. ధరలు కొంత అటూఇటూ ఉన్నా రైతులకు నష్టం ఉండదని తేల్చి చెబుతున్నారు.