Majlis In Bihar : మజ్లిస్ పార్టీ బిహార్ లోక్సభ ఎన్నికల్లోనూ పోటీ చేస్తోంది. ముస్లిం జనాభా అత్యధికంగా ఉండే సీమాంచల్ ప్రాంతంలో ఆ పార్టీ అభ్యర్థులు బరిలోకి దిగారు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి అభ్యర్థులు, కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి అభ్యర్థులకు టఫ్ ఫైట్ ఇవ్వడమే వీరి లక్ష్యం. సీమాంచల్ ప్రాంతంలో కిషన్గంజ్, కతిహార్, పూర్నియా, అరారియా జిల్లాలు ఉన్నాయి. వీటి పరిధిలో కిషన్గంజ్, కతిహార్, పూర్నియా, భాగల్పూర్, బంకా లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఈ ఐదుచోట్ల కూడా మజ్లిస్ పోటీ చేస్తోంది. బిహార్లోని మరో 6 స్థానాల్లోనూ మజ్లిస్ అభ్యర్థులు బరిలోకి దిగారు. మజ్లిస్ ప్రకటించిన మొత్తం 11 మంది అభ్యర్థుల్లో ఐదుగురు ముస్లిం అభ్యర్థులే. సీమాంచల్ ప్రాంతంలోని నాలుగు లోక్సభ స్థానాలకు రెండో విడతలో ఏప్రిల్ 26న పోలింగ్ జరగబోతోంది.
We’re now on WhatsApp. Click to Join
మజ్లిస్ పార్టీ(Majlis In Bihar) ఈసారి బిహార్లో ఎక్కువ ఆశలు పెట్టుకున్న లోక్సభ స్థానం కిషన్గంజ్. ఈ సీటు పరిధిలో 68 శాతం ముస్లిం ఓటర్లే ఉన్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ మజ్లిస్ పార్టీ మూడోస్థానంలో నిలిచింది. ఈసారి తమ పార్టీ అభ్యర్థి మహ్మద్ అక్తరుల్ ఇమాన్ గెలుస్తారని అసదుద్దీన్ ఒవైసీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అక్తరుల్ ఇమాన్కు మద్దతుగా అసదుద్దీన్ ఒవైసీ ఐదు రోజుల పాటు కిషన్గంజ్లోనే ఉండి ప్రచారం చేయనున్నట్లు సమాచారం. కిషన్గంజ్ నుంచి సిట్టింగ్ ఎంపీ, కాంగ్రెస్ నేత మహ్మద్ జావేద్ మళ్లీ పోటీ చేస్తున్నారు. ఎన్డీయే కూటమి తరఫున జేడీయూ నేత ముజాహిద్ ఆలం బరిలోకి దిగారు. గత ఎన్నికల్లో ముజాహిద్ ఆలం సెకండ్ ప్లేసులో నిలిచారు. ఏ రకంగా చూసుకున్నా కిషన్గంజ్లో ముక్కోణపు పోటీ ఖాయమనిస్తోంది.