LIC Scholarship : పేద విద్యార్థులకు ప్రభుత్వ రంగ బీమా సంస్థ LIC చేదోడు అందిస్తోంది. ఇందుకోసం ‘ఎల్ఐసీ గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ స్కీమ్’ను అమలు చేస్తోంది. డిగ్రీ, డిప్లొమా, ఇంజినీరింగ్, మెడిసిన్, ఒకేషనల్ కోర్సులు చదవాలనుకునే విద్యార్థులు ఇందుకు అర్హులు. ప్రతిభ ఉండి కూడా, ఆర్థిక పరిస్థితుల కారణంగా ఉన్నత విద్య అభ్యసించలేకపోతున్న వారికి ఈ స్కాలర్షిప్ అందిస్తారు. జనవరి 14లోగా ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. ఇందుకోసం అభ్యర్థులు ఎల్ఐసీ అధికారిక వెబ్సైట్ https://licindia.in/ ఓపెన్ చేసి Apply for Golden Jubilee Scholarship Scheme 2023 అనే లింక్ ద్వారా అప్లికేషన్ సమర్పించాలి.
జనరల్ కేటగిరీ స్కాలర్షిప్ ఇలా..
- 2022-23 విద్యా సంవత్సరంలో కనీసం 60% మార్కులతో ఇంటర్ లేదా డిప్లొమా కోర్సులో పాసై ఉండాలి.
- ప్రస్తుతం ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన కళాశాలలు/ విద్యా సంస్థల్లో ఏదైనా డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్, డిప్లొమా, వృత్తి విద్య లేదా తత్సమానమైన కోర్సులు చేస్తుండాలి.
- విద్యార్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2.50 లక్షలలోపు ఉండాలి.
- మెడిసిన్ విద్యార్థులకు స్కాలర్షిప్ కింద ఏటా రూ.40వేలు ఇస్తారు. దీనిని మూడు విడతలుగా (రూ.12000/ రూ.12000/ రూ.16000) అందిస్తారు.
- ఇంజినీరింగ్ విద్యార్థులకు జనరల్ స్కాలర్షిప్గా ఏడాదికి రూ.30వేలు ఇస్తారు. దీనిని మూడు విడతల్లో (రూ.9000/ రూ.9000/ రూ.12000) చెల్లిస్తారు.
- డిగ్రీ, ఇంటిగ్రేటెడ్ కోర్సులు, డిప్లొమా, ఒకేషనల్ కోర్సులు చేసేవారికైతే, ఆ కోర్సు పూర్తయ్యేవరకు ఏటా రూ.20వేలు చొప్పున జనరల్ స్కాలర్షిప్ ఇస్తారు.
- ఈ మొత్తాన్ని మూడు విడతలుగా (రూ.6000/ రూ.6000/ రూ.8000) విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో జమ(LIC Scholarship) చేస్తారు.
గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్ ఇలా..
- 10వ తరగతి తర్వాత బాలికల ఉన్నత విద్యను ప్రోత్సహించేందుకు స్పెషల్ గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్ను ఎల్ఐసీ అందిస్తోంది.
- 2022-23 విద్యా సంవత్సరంలో కనీసం 60 శాతం మార్కులతో పదో తరగతిలో పాసై.. ప్రస్తుతం ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన కళాశాలలు/ విద్యా సంస్థల్లో ఇంటర్మీడియట్, ఒకేషనల్, డిప్లొమా, ఐటీఐ కోర్సు చేస్తున్నవారు దీనికి అర్హులు.
- అభ్యర్థిని తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2.50 లక్షలలోపు ఉండాలి.
- 10వ తరగతి, ఇంటర్లో పొందిన మార్కుల మెరిట్ + విద్యార్థి/ విద్యార్థిని కుటుంబ ఆర్థిక పరిస్థితుల ఆధారంగా ఈ స్కాలర్షిప్నకు ఎంపిక చేస్తారు. అల్పాదాయ వర్గాలవారికి ప్రథమ ప్రాధాన్యం ఉంటుంది.
- స్పెషల్ గర్ల్ చైల్డ్ స్కీమ్ కింద ఎంపికైన విద్యార్థినులకు ఏటా రూ.15 వేలు చొప్పున అందిస్తారు.
- పదో తరగతి పూర్తయిన తర్వాత ఇంటర్, ఒకేషనల్/ డిప్లొమా కోర్సులను పూర్తి చేసేందుకు ఈ మొత్తాన్ని మూడు దఫాలుగా (రూ.4500/ రూ.4500/ రూ.6000) చెల్లిస్తారు.