President Draupadi Murmu : లగచర్ల పంచాయితీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు చేరింది. ఈ మేరకు లగచర్ల బాధితుల గోడును రాష్ట్రపతి వివరించేందుకు బీఆర్ఎస్ సిద్దమైంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నేతలు రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరారు. లగచర్లలో గిరిజనులపై పోలీసుల చర్యలకు సంబంధించిన సమాచారాన్ని రాష్ట్రపతి కార్యాలయ అధికారులు కోరడం ఆసక్తికరంగా మారింది. లగచర్లలో ఫార్మా కంపెనీ నిర్మాణం కోసం బలవంతపు భూ సేకరణ..ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా కలెక్టర్ పై దాడి, పోలీసుల చర్యలపైన, గిరిజన మహిళలపై వారి దౌర్జన్యం వంటి అంశాలపై బీఆర్ఎస్ నాయకులు రాష్ట్రపతి కార్యాలయానికి అందజేశారు.
మరోవైపు రాష్ట్రపతిని కలసి మా గోడు వినిపించే వరకు ఢిల్లీలోనే ఉంటామని గిరిజన మహిళలు స్పష్టం చేశారు. ఇప్పటికే లగచర్లలో గిరిజన కుటుంబాలపై జరిగిన దాడులు, అక్రమ అరెస్ట్ లపై ఎస్సీ, ఎస్టీ,మహిళ, మానవహక్కుల కమిషన్ లను కలిసి రాష్ట్ర ప్రభుత్వంపై బాధితులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
కాగా, లగచర్లలో వికారాబాద్ జిల్లా కలెక్టర్పై దాడి ఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. బాధ్యులైన వారిపై చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే.. రైతుల ముసుగులో దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయగా.. ఇప్పుడు శాఖ పరమైన చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే.. అధికారులు అక్కడికి వెళ్లకుండా అడ్డుకోనందుకు, వారికి సరైన రక్షణ కల్పించడంలో విఫలమైన కారణంగా.. పరిగి డీఎస్సీ కరుణసాగర్ రెడ్డిని డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పరిగి కొత్త డీఎస్పీగా శ్రీనివాస్ ని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.