కశ్మీర్ (Kashmir)..ఈ పేరు చెపితే ఉగ్రవాదుల దాడులు..నిత్యం బాంబుల మోత..ఎప్పుడు ఏ దాడి జరుగుతుందో అనే భయం..టెన్షన్ ఇవే గుర్తుకు వస్తాయి. కానీ NDA Government ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్లో అనేక మార్పులు వస్తున్నాయి. జాతీయ జెండా ఎగురవేయడానికి భయపడిన పరిస్థితుల నుంచి జాతీయ పతాకలు తయారు చేసేలే పరిస్థితులు మారిపోయాయి. తాజాగా కాశ్మీర్ లోని మారుమూల గ్రామానికి చెందిన కార్పెట్ నేత ఒకరు భారతదేశ మ్యాప్ను త్రివర్ణ పతాకంలో చూపే గోడకు వేలాడే కార్పెట్ను తయారు చేసి తన దేశభక్తిని చాటుకున్నాడు.
అష్టెంగూ గ్రామానికి చెందిన మహ్మద్ మక్బూల్ దార్ (Mohammad Maqbool Dar) దాదాపు 35 ఏళ్లుగా కార్పెట్లు తయారు చేస్తూ ఉపాధి పొందుతున్నాడు. ఆజాతీకా అమృత్ మహోత్సవాల సందర్భంగా ఈ స్వాతంత్య్ర దినోత్సవాన్ని (Independence Day ) పురస్కరించుకుని ప్రత్యేకంగా ఏదైనా చేయాలనీ భావించాడు. అప్పుడు తన మదిలో భారతదేశ మ్యాప్ను త్రివర్ణ పతాకంలో చూపే గోడకు వేలాడే కార్పెట్ను తయారుచేయాలని అనుకున్నాడు. అనుకున్నదే దరువు..అతడు ఏలైతే అనుకున్నాడో దానిని చేసి చూపించాడు.
‘నేను నా దేశం కోసం ఏదైనా విభిన్నంగా చేయాలని ఆలోచిస్తున్నాను, కాబట్టి నేను త్రివర్ణ పతాకంలో భారతదేశ పటాన్ని తయారు చేశాను. ఈ డిజైన్ను నేయడానికి నాకు రెండు నెలలు పట్టింది’ అని దార్ తన యూనిట్ ’డిలైట్ కార్పెట్ వీవర్స్’లో తెలియజేసాడు. అలాగే కాశ్మీరీ కళకు కొత్త జీవం పోసేలా కొత్త పార్లమెంటులో ఎక్కడో ఒక చోట తాను తయారు చేసిన త్రివర్ణ కార్పెట్ను ఉంచాలని దార్ కోరుకుంటున్నాడు. ఇది దేశం పట్ల తనకు ఉన్న ప్రేమ, ఆప్యాయతకు చిహ్నమని పేర్కొన్నాడు. త్వరలో ప్రధాన మంత్రి మోడీ చిత్రపటాన్ని చూపించే కొత్త కార్పెట్ డిజైన్ తయారు చేస్తానని చెప్పుకొచ్చాడు.