Kartavya Path : న్యూఢిల్లీలోని కర్తవ్యపథ్.. మన దేశ 75వ గణతంత్ర దినోత్సవాలకు మరోసారి ముస్తాబైంది. ఈసారి వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మ్యాక్రాన్ హాజరవుతున్నారు. 2024 సంవత్సర గణతంత్ర దినోత్సవ థీమ్గా ‘ఇండియా-మదర్ ఆఫ్ డెమోక్రసీ’, ‘వికసిత్ భారత్’గా ఎంపిక చేశారు. ఏటా రిపబ్లిక్ డే సందర్భంగా కర్తవ్యపథ్లో నిర్వహించే పరేడ్, త్రివిధ దళాల కవాతు, సైనిక ప్రదర్శనలు ఎంతో అలరిస్తాయి. ఈ వేడుకలను ప్రత్యక్షంగా చూసేందుకు దేశం నలుమూలల నుంచి ఎంతోమంది ఢిల్లీకి వెళ్తుంటారు. ఇంతకీ ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ను కర్తవ్యపథ్లోనే ఎందుకు నిర్వహిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join.
గణతంత్ర వేడుకలకు ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. కర్తవ్యపథ్ (Kartavya Path) చుట్టూ 14 వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఏడాది గణతంత్ర వేడుకలకు 77వేలమంది ఆహ్వానితులు వస్తారని అంచనా వేస్తున్నారు. భద్రతా, ట్రాఫిక్, జిల్లా యూనిట్లతో కలిసి హస్తినలో భద్రతను సమన్వయం చేస్తామని ఢిల్లీ ప్రత్యేక పోలీసు కమిషనర్ దీపేంద్ర పాఠక్ తెలిపారు. 14 వేల మందిని కర్తవ్యపథ్ వద్ద మోహరిస్తామని వివరించారు. కమాండోలు, సత్వర స్పందన దళాలు, PCR వ్యాన్లు, స్వాట్ బృందాలు నిర్దేశిత ప్రాంతాల్లో ఉంటాయని చెప్పారు. ఎలాంటి అత్యవసర పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేలా పోలీసులు సిద్ధమైనట్లు ప్రత్యేక కమిషనర్ పాఠక్ వెల్లడించారు. సీసీ కెమెరాలతో పాటు ప్రతిమూలనా పోలీసుల నిఘా ఉంటుందని చెప్పారు. గగనతలం నుంచి తలెత్తే ముప్పును సైతం ఎదుర్కొనేలా సిద్ధమైనట్లు తెలిపారు.న్యూఢిల్లీ జిల్లాను 28 జోన్లుగా విభజించి రక్షణ ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ప్రతి జోన్ను డీసీపీ లేదా అదనపు డీసీపీ స్థాయి అధికారి పర్యవేక్షిస్తారని చెప్పారు. గణతంత్ర వేడుకలకోసం జనవరి 25 రాత్రి 10 గంటల నుంచి జనవరి 26 ఉదయం వరకూ వాహనాల రాకపోకలను నియంత్రిస్తామని, దారిమళ్లిస్తామని ఢిల్లీ ట్రాఫిక్ ప్రత్యేక కమిషనర్ HGS ధాలివల్ చెప్పారు. వేడుకలకు వచ్చే సందర్శకులు వీలైనంత వరకు ప్రజా రవాణానే ఎంచుకోవాలని సూచించారు.