Cheaper Vs Dearer : ఎన్నికల వేళ కేంద్ర సర్కారు ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ మధ్యతరగతి వర్గానికి కాస్త ఊరట కల్పించే నిర్ణయాలు తీసుకుంది. ఉద్యోగ వర్గానికి మాత్రం ఈసారి నిరాశే ఎదురైంది. కేంద్ర ప్రభుత్వం ఈసారి ఆదాయపు పన్ను సహా ఇతర పథకాల జోలికీ వెళ్లకపోవడం ఉద్యోగ వర్గానికి షాకిచ్చింది. ఎన్నికలు సమీపంలోనే ఉన్నప్పటికీ ఉద్యోగ వర్గాన్ని ప్రసన్నం చేసుకునే ప్రయత్నాన్ని మోడీ సర్కారు చేయకపోవడం గమనార్హం. బడ్జెట్ అనగానే వేటి ధరలు తగ్గుతాయి.. వేటి ధరలు పెరుగుతాయనే విషయాన్ని ప్రజలు చెక్ చేస్తుంటారు. ఎందుకంటే ప్రజలపై నేరుగా ఎఫెక్టు చూపించేది వస్తువులు, సర్వీసులు, ఉత్పత్తుల ధరలే(Cheaper Vs Dearer). 2024 బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం.. వీటి గురించి ఎలాంటి ప్రకటనలు కూడా చేయలేదు. అంటే ఆ రేట్లు యథాతథంగానే ఉంటాయన్న మాట.
We’re now on WhatsApp. Click to Join
వాస్తవానికి మధ్యంతర బడ్జెట్ కంటే ఒకరోజు ముందే (జనవరి 31న) కేంద్ర సర్కారు ఒక కీలక ప్రకటన చేసింది. మొబైల్ ఫోన్ తయారీలో ఉపయోగించే విడిభాగాల దిగుమతులకు సంబంధించి దిగుమతి సుంకం తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. గతంలో ఇది 15 శాతంగా ఉండగా.. ఇప్పుడు 10 శాతానికి తగ్గించారు. ఇండియాలో మొబైల్ ఫోన్ల తయారీకి మరింత మద్దతు అందించి ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల మన దేశం నుంచి ఇతర దేశాలకు పెద్ద ఎత్తున ఫోన్లను ఎగుమతి చేసేందుకు కూడా బాటలు పడనున్నాయి. ఈ నిర్ణయంతో మొబైల్ ఫోన్ల తయారీకి ఉపయోగించే బ్యాటరీ కవర్లు, మెయిన్ లెన్స్, బ్యాక్ కవర్స్, యాంటెన్నా, సిమ్ సాకెట్స్, ఇతర ప్లాస్టిక్, మెటల్ మెకానికల్ ఐటెమ్స్పై దిగుమతి సుంకం తగ్గనుంది. దీంతో వీటి ధరలు దిగొస్తాయి. వెరసి.. స్మార్ట్ ఫోన్ల ధరలు కూడా తగ్గుతాయని అంచనా వేస్తున్నారు.
ఇక ఇదే సమయంలో ఫిబ్రవరి 1న కేంద్రం వేరుగా మరో కీలక ప్రకటన చేసింది. విమాన ఇంధనం ధరల్ని భారీగా తగ్గించింది. ఢిల్లీలో ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్ లేదా జెట్ ఫ్యూయెల్ ధరల్ని కిలో లీటరుకు రూ. 1221 తగ్గించడం విశేషం.గత బడ్జెట్ అంటే 2023 సమయంలో చాలా వస్తువుల ధరల్ని తగ్గించింది కేంద్రం. టీవీలు, స్మార్ట్ఫోన్లు, కంప్రెస్డ్ గ్యాస్, ష్రింప్ ఫీడ్, ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ వంటి ధరలు తగ్గాయి. సిగరెట్లు, ఎయిర్ ట్రావెల్, టెక్స్టైల్స్ వంటి ఉత్పత్తులు భారమయ్యాయి.