Savitri Jindal : 2023 సంవత్సరంలో నికర సంపద విలువ (నెట్ వర్త్) అత్యధికంగా పెరిగిన వ్యాపార దిగ్గజం ఎవరో తెలుసా ? ముకేశ్ అంబానీ కాదు.. గౌతమ్ అదానీ కాదు.. సావిత్రీ జిందాల్!! ఈ ఏడాది జనవరి నుంచి డిసెంబరు మధ్యకాలంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ నికర సంపద విలువ రూ.41వేల కోట్లు (5 బిలియన్ డాలర్లు) పెరిగింది. అయితే ఇదే కాలంలో సావిత్రీ జిందాల్ నెట్ వర్త్ ఏకంగా రూ.80వేల కోట్లు (9.6 బిలియన్ డాలర్లు) పెరిగింది. దీంతో సావిత్రీ జిందాల్ మొత్తం సంపద విలువ రూ.2 లక్షల కోట్లు దాటేసింది. మొత్తం సంపద విలువ విషయంలో ఆమె విప్రో అధినేత అజీమ్ ప్రేమ్జీని దాటేశారు. అజీమ్ ప్రేమ్జీ మొత్తం సంపద విలువ దాదాపు రూ.1.99 లక్షల కోట్లు. బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్లో ఈవివరాలను ప్రస్తావించారు.
We’re now on WhatsApp. Click to Join.
2023 సంవత్సరంలో ఇప్పటివరకు నికర విలువ భారీగా పెరిగిన వారిలో రెండో స్థానంలో హెచ్సీఎల్ కంపెనీ అధిపతి శివ్ నాడార్ ఉన్నారు. గత సంవత్సరం కాలంలో ఈయన నికర విలువ రూ.66వేల కోట్లు పెరిగింది. DLF కంపెనీ అధినేత కేపీ సింగ్ నికర విలువ రూ.58వేల కోట్లు పెరిగింది. కుమార్ మంగళం బిర్లా, షాపూర్ మిస్త్రీల నికర విలువ చెరో రూ.52వేల కోట్లు చొప్పున పెరిగింది. ఈ జాబితాలో దిలీప్ షాంఘ్వీ, రవి జైపురియా, ఎంపీ లోధా, సునీల్ మిట్టల్ కూడా ఉన్నారు. ఇక ఇదే సమయంలో గౌతమ్ అదానీ మొత్తం సంపద విలువ రూ.7 లక్షల కోట్ల నుంచి రూ.2.91 లక్షల కోట్లకు తగ్గిపోయింది. అయితే ముకేశ్ అంబానీ తర్వాత రెండో అత్యంత సంపన్న భారతీయుడి ర్యాంకు ఇంకా గౌతమ్ అదానీ వద్దే ఉంది.
సావిత్రీ జిందాల్(Savitri Jindal) హర్యానాకు చెందిన పారిశ్రామికవేత్త. ఆమె భర్త, దివంగత ఓపీ జిందాల్ .. ఓపీ జిందాల్ గ్రూప్ను స్థాపించారు. ఆయన కాలం చేశాక.. సావిత్రీ జిందాల్ చైర్పర్సన్గా వ్యవహరిస్తున్నారు . JSW స్టీల్, జిందాల్ స్టీల్ & పవర్, JSW Engery, JSW సా, జిందాల్ స్టెయిన్లెస్, JSW హోల్డింగ్స్ వంటి ప్రఖ్యాత కంపెనీలన్నీ జిందాల్ గ్రూపునకు చెందినవే. పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్ ఆమె కుమారుడే.