Delhi Pollution :వాయు కాలుష్యం గుప్పిట్లో చిక్కుకొని దేశ రాజధాని ఢిల్లీ విలవిలలాడుతోంది. కాలుష్య రాక్షసి కబంధ హస్తాల నుంచి హస్తినను బయటపడేసేందుకు ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) కాన్పూర్’ ఒక ప్రపోజల్ను రెడీ చేసింది. ఢిల్లీ నగర వాతావరణంలో ఆవరించి ఉన్న కాలుష్యభరిత దుమ్మూ ధూళి కణాలను తొలగించేందుకు ఒక ఐడియాను తయారు చేసింది. అదే.. ‘‘కృత్రిమ వర్షం’’. క్లౌడ్ సీడింగ్ చేయడం ద్వారా కృత్రిమ వర్షాలను కురిపించి ఢిల్లీ వాతావరణంలోని కాలుష్య కారకాలను నేలమట్టం చేయొచ్చని ఐఐటీ కాన్పూర్ శాస్త్రవేత్తలు సూచించారు. క్లౌడ్ సీడింగ్ ద్వారా కృత్రిమ వర్షాలను కురిపించడంపై తాము ఇప్పటికే విజయవంతంగా ప్రయోగ పరీక్షలను నిర్వహించామని(Delhi Pollution ) వెల్లడించారు.
We’re now on WhatsApp. Click to Join.
దీనిపై తాము ఇప్పటికే ఢిల్లీ ఆరోగ్యశాఖ ఎదుట ప్రజెంటేషన్ కూడా ఇచ్చామని సైంటిస్టులు చెప్పారు. ప్రతి సంవత్సరం చలికాలంలో ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రరూపు దాలుస్తోంది. ఏటా చలికాలానికి కొన్ని వారాల ముందు హస్తినలో కృత్రిమ వర్షాలను కురిపించే కసరత్తు చేస్తే బాగుంటుందని ఐఐటీ కాన్పూర్కు చెందిన శాస్త్ర వర్గాలు వెల్లడించాయి. ‘‘క్లౌడ్ సీడింగ్ చేసేందుకు ఢిల్లీ గగనతలంలో విమానాలను తిప్పాలి. ఇందుకోసం కేంద్ర హోం శాఖ, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్, డైెరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నుంచి అనుమతులను పొందాలి’’ అని చెప్పారు. ఇవన్నీ జరగాలంటే ఢిల్లీ సర్కారు, కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా ఆమోదం తెలపాల్సి ఉంటుందని ఐఐటీ కాన్పూర్ వర్గాలు తెలిపాయి. వాస్తవానికి ఈవివరాలను ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ కూడా ఇటీవలే వెల్లడించారు. ఢిల్లీ ప్రజలకు ఊరట కలిగించే, వారి ఆరోగ్యానికి భద్రత కల్పించే ఏ నిర్ణయాలనైనా తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.