“కాదేదీ విద్యుత్ ఉత్పత్తికి అతీతం” అనే విధంగా కొత్తకొత్త ప్రయోగాలు జరుగుతున్నాయి.ఈక్రమంలోనే మానవ శరీర వేడి నుంచీ విద్యుత్ ను(Charging With Body Heat) ఉత్పత్తి చేయడంపై హిమాచల్ ప్రదేశ్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) మండి పరిశోధకులు రీసెర్చ్ చేస్తున్నారు. మానవ శరీర వేడిని విద్యుత్గా మార్చగల థర్మో ఎలక్ట్రిక్ పదార్థాలను వారు అభివృద్ధి చేస్తున్నారు. ఐఐటీ మండి అసోసియేట్ ప్రొఫెసర్ అజయ్ సోనీ నేతృత్వంలోని రీసెర్చ్ టీమ్ ఈ స్టడీ చేస్తోంది. ఇది సౌరశక్తికి పూర్తిగా భిన్నమైనది. ఈ ప్రక్రియకు చాలా పెద్ద పరికరాలు అవసరం లేదు.
చాలా ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను, సెల్ఫోన్లు, ల్యాప్టాప్లు, చేతి గడియారాలు, ఇయర్ఫోన్లను మానవ శరీరంలోని వేడితో ఛార్జ్ చేయవచ్చని సోనీ తెలిపారు. ఇందుకోసం మానవ శరీరం నుంచి వేడిని గ్రహించి విద్యుత్తుగా(Charging With Body Heat) మార్చగల ఒక నమూనా మాడ్యూల్ను అభివృద్ధి చేసినట్లు వెల్లడించారు. ఈ టెక్నాలజీ ద్వారా మొబైల్ ఫోన్లను అరచేతిలో పెట్టుకుని లేదా జేబులో పెట్టుకుని చార్జింగ్ చేసుకోవచ్చు. ల్యాప్టాప్ను ఛార్జర్ లేకుండా నేరుగా మన ఒడిలో ఉంచడం ద్వారా ఛార్జ్ చేయవచ్చు. వాటిని ఛార్జ్ చేయడానికి మానవ శరీరం నుంచి వెలువడే వేడి సరిపోతుందని సోనీ వివరించారు. అయితే ఇందుకోసం కొన్ని పరికరాలతో కూడిన చిన్న మాడ్యూల్ సెట్ ను వాడాల్సి ఉంటుందన్నారు. ఈ మాడ్యూల్ సెట్ మన శరీర వేడిని గ్రహించి విద్యుత్ శక్తిగా మార్చడం ద్వారా మనం వాడే పరికరాన్ని ఛార్జ్ చేస్తుంది.