MLC Kavitha: రేపు (మంగళవారం) సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సే కవిత బెయిల్ పిటిషన్పై విచారణ జరుగనుంది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టు అయిన కవిత..ప్రస్తుతం తీహార్ జైల్లో ఉంటున్న విషయం తెలిసిందే. ఆమె ఇటీవలే తీవ్ర అస్వస్థతకు గురి కాగా, ఢిల్లీ ఎయిమ్స్కు తరలించి చికిత్స అందించారు. అనంతరం తిరిగి జైలుకు తీసుకొచ్చారు. ఎమ్మెల్సీ కవిత మార్చి 15వ తేదీ నుంచి తీహార్ జైల్లో ఉంటున్నారు. కవిత తరఫున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించనున్నారు. దీంతో ఈసారి కవితకు బెయిల్ తప్పకుండా వస్తుందనే నమ్మకంతో బీఆర్ఎస్ నాయకత్వం ఉంది.
We’re now on WhatsApp. Click to Join.
కాగా, కవిత మార్చిలో జైలుకు వెళ్లగా.. జూలై 16న తొలిసారి అస్వస్థతకు గురయ్యారు. అప్పుడు కవితను ఢిల్లీలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. రెండు రోజుల తర్వాత 18న ఆమెను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపరచగా, తనకు ఎదురవుతున్న అనారోగ్య సమస్యలను జడ్జి కావేరి బవేజా దృష్టికి తీసుకెళ్లారు. కవిత విజ్ఞప్తి మేరకు ఢిల్లీ ఎయిమ్స్లో వైద్య పరీక్షలకు అనుమతి ఇచ్చారు. అప్పటి నుంచి ఆమె ఆరోగ్య పరిస్థితి పూర్తిగా మెరుగుపడలేదు. జైలు వైద్యులే ఆమెకు వైద్యం అందిస్తున్నారు.
మళ్లీ ఆగస్టు 22న కవిత అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఢిల్లీ ఎయిమ్స్కు కవితను తరలించి.. ఆమె భర్త అనిల్ సమక్షంలో వైద్య పరీక్షలు చేశారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో తిరిగి జైలుకు తరలించారు. ఆమె సుమారు ఐదున్నర నెలల నుంచి జైలులోనే ఉన్నారు. జైలుకు వెళ్లిన తర్వాత ఆమె సుమారు 11 కేజీల బరువు తగ్గారు.