Telangana Government: మాజీ మంత్రి హరీష్ రావు ఈరోజు సిద్దిపేట జిల్లా నంగునూరులో రుణమాఫీ కోసం అన్నదాతలు చేపట్టిన దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన రైతులకు రుణమాఫీ చేసే వరకు సీఎం రేవంత్రెడ్డిని నిద్రపోనివ్వనని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందన్నారు. దసరా లోపు రుణమాఫీ చేయకుంటే రాష్ట్రవ్యాప్తంగా రైతులతో కలిసి సచివాలయాన్ని ముట్టడిస్తామని హరీష్ రావు డెడ్ లైన్ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే రాష్ట్రవ్యాప్తంగా 490 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు.
Read Also: Robbery in Bhatti House : డిప్యూటీ సీఎం భట్టి ఇంట్లో చోరీ
రైతు రుణమాఫీ పేరుతో అన్నదాతలకు మాయమాటలు చెప్పారు. రైతు రుణమాఫీ చేయకుండా ప్రభుత్వం సాకులు చెబుతోందని రేవంత్ రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో సుమారు 21 లక్షల మంది అన్నదాతల రుణాలు ఇంతవరకు మాఫీ కాలేదని ఆరోపించారు. అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతర రైతులకు కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ అందలేదని హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ వచ్చాక రైతు విలువ తగ్గిందని… కాలేశ్వరం కూలిపోయింది అన్నాడు ఇప్పుడు వచ్చి రేవంత్ రెడ్డి చూడాలని కోరారు. రేవంత్ రెడ్డికి కూలకొట్టడం తప్ప కట్టడం తెలవదని ఫైర్ అయ్యారు. అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ అబద్ధమాడింది… నేను గట్టిగా ప్రశ్నిస్తే నన్ను తిట్టడం మొదలుపెట్టాడన్నారు.