Grand Jumbo Tulabhara : తులాభారాల్లో.. ఈ తులాభారం రేంజే వేరు !! ఏకంగా 5,555 కిలోల రూ.10 నాణేలతో తులాభారం వేశారు మరి!! ఈ నాణేల విలువ ఎంతో తెలుసా .. 75 లక్షల రూపాయలు!! 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని శిరహట్టి ఫకీరేశ్వర మఠం పీఠాధిపతి ఫకీర సిద్దరామస్వామిని ఏనుగుపై కూర్చోబెట్టి రూ.75లక్షలకుపైగా విలువ చేసే 10 రూపాయల నాణేలతో తులాభారం వేశారు. ఈ జంబో తులాభార కార్యక్రమం(Grand Jumbo Tulabhara) కర్ణాటకలోని హుబ్బళ్లిలో ఘనంగా జరిగింది. ఇందుకోసం 5,555 కిలోల రూ.10 నాణేలను వినియోగించారు. ఈ తులాభారం వేయడానికి రూ.22 లక్షలతో 40 అడుగుల పొడవు, 30 అడుగుల ఎత్తు, 20 అడుగుల వెడల్పున్న భారీ ఇనుప త్రాసును ఉపయోగించారు. రాయ్పుర్ ఇండస్ట్రీయల్ ఏరియాలోని ఓ కంపెనీ ఈ భారీ త్రాసును తయారు చేసింది. దీని బరువు 25 టన్నులకు పైగా ఉంటుంది. మొత్తం మీద ఈ తులాభారానికి వినియోగించిన డబ్బులను పేద విద్యార్థుల చదువుకు సాయంచేసే కార్పస్ ఫండ్ ఏర్పాటుకు వాడనున్నారు. సామాజిక సేవా కోణంలో నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. విద్యారంగం వికాసం కోసం ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని కోరుతున్నారు.
We’re now on WhatsApp. Click to Join
”శిరహట్టి ఫకీరేశ్వర మఠం పీఠాధిపతి ఫకీర సిద్ధరామస్వామి అమృత మహోత్సవంలో భాగంగా భారీ తులాభారం నిర్వహించాం. నెహ్రూ మైదాన్లో జరిగిన ఈ కార్యక్రమ వివరాలను గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్కు పంపనున్నారు. అందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశారు. తులాభారం రోజున లక్ష మందికి ప్రసాదం ఏర్పాటు చేశాం” అని ఫకీర్ దింగాళేశ్వర స్వామీజీ మీడియాకు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి హెచ్.కె. పాటిల్, ఈశ్వర్ ఖండ్రే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర, మాజీ పరిషత్ సభ్యుడు జగదీష్ షెట్టర్ తదితరులు పాల్గొన్నారు.
శిరహట్టి ఫకీరేశ్వర మఠం పీఠాధిపతి ఫకీర సిద్ధరామస్వామి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని శిరహట్టి ఫకీరేశ్వర మఠం నిర్వాహకులు ఏడాదిపాటు భవైక్యతా రథయాత్ర నిర్వహించారు. అయితే తులభారానికి ముందు హుబ్బళ్లిలోని త్రిమురు సవీర మఠం నుంచి ఐదు ఏనుగులు, ఐదు ఒంటెలు సహా వివిధ బృందాలతో ఊరేగింపు జరిగింది. ఈ మహా శోభాయాత్రలో ఫకీర సిద్ధరామ స్వామిజీ, దింగాళేశ్వర స్వామీజీ, మూడువేల మఠాల స్వామీజీలు, వంద మందికిపైగా మఠాధిపతులు పాల్గొన్నారు.