సాధారణంగా రోడ్డు విస్తరణలో పనులు జరుగుతున్నప్పుడు రోడ్డుకు అడ్డంగా ఇల్లు, హోటల్స్, కొన్ని కొన్ని సార్లు గుళ్ళను కూడా కూల్చి వేస్తూ ఉంటారు. ఆ తరువాత వారికి ప్రభుత్వం అందుకు తగ్గట్టుగా నష్టపరిహారం కూడా చెల్లిస్తూ ఉంటుంది. కొంతమంది ఇటువంటి సమయంలోనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోట్లు కేసులు అంటూ తిరుగుతూ ఉంటారు. ఇంకొందరు వారికి ఎంతో ఇష్టమైన ఆ ఇంటిని వదిలి వెళ్లలేక, తప్పక ఇల్లు వదిలి వెళుతూ ఉంటారు. తాజాగా పంజాబ్ లో ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
పంజాబ్లోని సంగ్రూర్ జిల్లాలోని ఒక గ్రామానికి చెందిన సుఖ్విందర్ సింగ్ అనే రైతు ఎంతో ఇష్టంగా తన డ్రీం హౌస్ ని నిర్మించుకున్నాడు. ఇక రోడ్డు విస్తరణలో భాగంగా ఆ ఇంటిని కూల్చడం ఇష్టం లేదా ఏకంగా ఇంటినే తరలించేందుకు సిద్ధమయ్యాడు. సంగ్రూర్ జిల్లాలోని రోషన్వాలా గ్రామంలో ఆ రైతు స్థలంలో నిర్మించుకున్న ఇల్లు ఉన్న ప్రదేశం ఎక్స్ప్రెస్ వే రోడ్డుని నిర్మిస్తోంది కేంద్ర ప్రభుత్వం. భారత్మాల ప్రాజెక్ట్ కింద నిర్మిస్తున్న ఈ రహదారిని ఢిల్లీ, అమృత్సర్ కత్రా ఎక్స్ప్రెస్ వే మార్గంలో నిర్మిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఈ ఎక్ప్రెస్ వే హర్యానా, పంజాబ్, జమ్ముకాశ్మీర్ మీదుగా నిర్మిస్తున్నారు.
ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ సిఖ్విందర్ సింగ్ అనే రైతుకి తన ఇంటిని కూల్చివేసేందుకు నష్టపరిహారం కూడా చెల్లించింది. ఐతే సుఖ్విందర్కి తన ఇంటిని కూల్చడం ఇష్టం లేక మొత్తం ఇంటినే మరోక ప్రదేశానికి మార్చాలనుకున్నాడు. అందుకోసం ఏకంగా భవన నిర్మాణ కార్మికుల సహకారంతో సుమారు 250 అడుగుల మేర ఉన్న ఇంటిని 500 అడుగులు దూరం కదిలించేందుకు పనులు కొనసాగిస్తున్నాడు. తన డ్రీమ్ హౌస్ ని కదిపేందుకు చక్రాల వలే కనిపించే గేర్లను కూడా ఏర్పాటు చేశాడు. కాగా ఆ రైతు ఈ ఇంటిని నిర్మించడానికి దాదాపు రూ. 1.5 కోట్లు ఖర్చు అయ్యిందని, అదే సమయంలో ఇంటిని నిర్మించడానికి రెండేళ్లు పట్టిందని తెలిపాడు. అయితే ఢిల్లీ అమృత్సర్ కత్రా ఎక్ప్రెస్వే ప్రతిష్టాత్మకమైన జాతీయ రహదారి ప్రాజెక్టు అని పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ మాన్ గత నెలలో ప్రకటించిన సంగతి తెలిసిందే. పైగా ఈ రహదారి వల్ల కాశ్మీర్కు ప్రయాణించే ప్రయాణికులకు సమయం, డబ్బు, శక్తి ఆదా అవుతుందని ఆయన తెలిపారు.