Site icon HashtagU Telugu

DIESEL VEHICLES BAN : 2027 నాటికి డీజిల్ వెహికల్స్ బ్యాన్ ?

Diesel Vehicles Ban

Diesel Vehicles Ban

డీజిల్..  దీనితోనే నిత్యం కార్లు, ట్రక్కులు, లారీలు,  బస్సులు, ట్రాలీలు, ఆటోలు నడుస్తుంటాయి. డీజిల్ తో నడిచే ఈ వెహికల్స్ వల్ల తీవ్రమైన వాయు కాలుష్యం కలుగుతోంది.  ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. ఈనేపథ్యంలో కాలుష్యాన్ని తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకోబోతోందనే ప్రచారం జరుగుతోంది.  ఒక మిలియన్ (10 లక్షల) కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాల్లో 2027 సంవత్సరం నుంచి ఫోర్-వీలర్ డీజిల్ వెహికల్స్ ను పూర్తిగా బ్యాన్ (DIESEL VEHICLES BAN) చేయాలని మాజీ పెట్రోలియం సెక్రటరీ తరుణ్ కపూర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన శక్తి పరివర్తన సలహా కమిటీ సర్కారుకు సిఫార్సు చేసిందట. ఈ వార్త విని డీజిల్ వాహనాలు వినియోగించే వారు ఆందోళన చెందుతున్నారు. అయితే వారంతా ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇది(DIESEL VEHICLES BAN) కేవలం కమిటీ సిఫార్సు మాత్రమే దానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపలేదు. ఆమోదం తెలిపినా అది అమల్లోకి రావడానికి చాలా ఏళ్ళ టైం పడుతుంది. ఫోర్-వీలర్ డీజిల్ వెహికల్స్ ను బ్యాన్ అమల్లోకి వచ్చే లోగా..  ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్స్ , ఇథనాల్ కలిగిన పెట్రోల్ తో నడిచే ఫోర్ వీలర్స్, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ తో నడిచే వెహికల్స్ వినియోగాన్ని పెంచాలని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖకు తరుణ్ కపూర్ కమిటీ రికమెండ్ చేసింది. ప్రత్యేకించి వచ్చే పదేళ్లలో స్వచ్ఛ ఇంధన ప్రజా రవాణా లక్ష్యాన్ని సాకారం చేసుకునేందుకు సిటీల్లో డీజిల్ బస్సుల వినియోగాన్ని తగ్గించాలని కూడా కమిటీ కోరింది. 2035 నాటికి ఇంటర్నల్ కంబషన్ ఇంజన్లు కలిగిన మోటార్‌సైకిళ్లు, స్కూటర్లు, త్రీ వీలర్ లనూ తొలగించాలని నివేదికలో సూచించింది. వాహనాలను ఎలక్ట్రిక్ మోడ్‌లోకి తీసుకురావడానికి వచ్చే 10 నుంచి 15 సంవత్సరాల వరకు CNGని పరివర్తన ఇంధనంగా (కార్బన్ ఉద్గార ఇంధనాలకు ప్రత్యామ్నాయ ఇంధనం) ఉపయోగించడంపై దృష్టి పెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి కమిటీ తెలిపింది.  2024 సంవత్సరం నుంచి డెలివరీ వాహనాలు అంటే చిన్న ట్రక్కులు తదితర విద్యుత్ ఆధారిత వాహనాలను మాత్రమే నగరాల్లో రిజిస్టర్ చేయాలని సూచించింది. రవాణా అవసరాల కోసం రైల్వేలను  లేదా గ్యాస్‌తో నడిచే ట్రక్కులను ఉపయోగించాలని కోరింది.
ALSO READ : Electric Roads in India: ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే కాదండోయ్ ఎలక్ట్రిక్ రోడ్లు కూడా.. ప్రయాణిస్తూనే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు?

కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం ఏమిటి?

చైనా, అమెరికా, యూరోపియన్ యూనియన్ తర్వాత కార్బన్ డయాక్సైడ్ విడుదల చేసే నాలుగో అతిపెద్ద దేశం భారత్. అయినా మనం అమెరికా కంటే ఆరు రెట్లు తక్కువ.. చైనా కంటే మూడు రెట్లు తక్కువ కార్బన్ డయాక్సైడ్‌ను విడుదల చేస్తాం.  వాతావరణంలోకి రిలీజ్ అయ్యే కార్బన్ ఉద్గారాలను  2070 నాటికి సున్నాకు చేర్చాలి అనేది కేంద్ర ప్రభుత్వం టార్గెట్. ఇందులో భాగంగానే ఎలక్ట్రిక్ వాహన రంగానికి, సోలార్ పవర్ వాడకానికి ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఒక  నివేదిక ప్రకారం 2040 సంవత్సరం నాటికి మన  దేశంలో డీజిల్ డిమాండ్ గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. ఆ తర్వాత అది తగ్గడం ప్రారంభమవుతుంది. ఎందుకంటే అప్పటికి ఎలక్ట్రిక్ వాహనాలు రోడ్లపై తిరగడం ప్రారంభిస్తాయి. 2030 సంవత్సరం తర్వాత గృహావసరాల వంట గ్యాస్ డిమాండ్ తగ్గడం ప్రారంభిస్తుంది. 2070 నాటికి ఆ డిమాండ్  పూర్తిగా ముగుస్తుంది. ఎందుకంటే అప్పటికి విద్యుత్ శక్తిని వంట కోసం పూర్తిగా వినియోగిస్తారు.అయితే పెట్రోల్, డీజిల్ వంటి   శిలాజ ఇంధనాల వినియోగం ఎంత త్వరగా తగ్గుతుందనేది..  ప్రాథమికంగా ఆటో రంగం ఎలక్ట్రిక్ వాహనాలకు ఎంత వేగంగా మారుతుందనే దానిపై ఆధారపడి ఉంటుంది.

పెట్రోలియం మంత్రిత్వ శాఖ వివరణ.. 

2027 సంవత్సరం నుంచి ఫోర్-వీలర్ డీజిల్ వెహికల్స్ పూర్తిగా బ్యాన్ అవుతాయనే వార్తలపై ట్విట్టర్ ద్వారా కేంద్ర పెట్రోలియం శాఖ  వివరణ ఇచ్చింది. 2027 నాటికి  డీజిల్ వాహనాల బ్యాన్ ప్రతిపాదన ఇంకా ఆమోదించబడలేదని స్పష్టం చేసింది. కాలుష్య ఉద్గారాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్యానెల్ ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చిందని, ఇది భవిష్యత్తుకు సంబంధించినదని వెల్లడించింది. ఇది ఇంకా చర్చల దశలోనే  ఉందని.. ఇంకా ఆమోదించబడలేదని తేల్చి చెప్పింది.