ప్రయాణానికి ట్రాక్టర్ ట్రాలీలను ఉపయోగించరాదని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం గట్టిగా చెబుతున్నప్పటికీ, స్కూల్ పిల్లలను ట్రాక్టర్ ట్రాలీలో తీసుకెళ్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇటుకలను సరఫరా చేసి బట్టీకి తిరిగి వస్తుండగా కొంతమంది పాఠశాల పిల్లలు లిఫ్ట్ కోసం ట్రాక్టర్ ట్రాలీలో ఎక్కారు. ఈ సంఘటన శనివారం ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని కేలాదేవి ప్రాంతంలోని రాష్ట్ర రహదారిపై చోటుచేసుకుంది.
ఈ ఘటనపై ట్రాన్స్పోర్ట్ సబ్-ఇన్స్పెక్టర్ అనూజ్ మాలిక్ మాట్లాడుతూ:. మేము వైరల్ వీడియోలో కనిపించిన ట్రాక్టర్ ట్రాలీ కోసం వెతుకుతున్నాము. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని స్థానికులకు సూచిస్తున్నాం. రద్దీగా ఉండే వాహనాల్లో పిల్లలను పాఠశాలలకు పంపవద్దని తల్లిదండ్రులను అభ్యర్థిస్తున్నాం. పాఠశాల రవాణా వాహనాలు అనుసరించాల్సిన మార్గదర్శకాలు ఉన్నాయి. ఎవరైనా వాటిని ఉల్లంఘిస్తే చలాన్లు జారీ చేస్తున్నాము లేదా వాహనాలను సీజ్ చేస్తామని ఆయన పేర్కొన్నారు.
సంభాల్లో పాఠశాల పిల్లలు JCB మెషీన్పై పాఠశాలకు వెళ్తున్న చిత్రం వైరల్ అయిన మరుసటి రోజు ఇది జరిగింది. అదనపు ప్రాంతీయ రవాణా అధికారి అంబరీష్ కుమార్ జేసీబీని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం చిన్నారులతో సమావేశమై వారి వాంగ్మూలాలను నమోదు చేసుకున్నారు. సరదా కోసమే తాము జేసీబీ ఎక్కామని, అందులో ప్రయాణించే ఉద్దేశం లేదని పిల్లలు చెప్పారు. అనంతరం పాఠశాల విద్యార్థులతో అధికారులు సమావేశాన్ని నిర్వహించి ఇలాంటి పద్ధతుల వల్ల వారి జీవితాలు ప్రమాదంలో పడతాయని సూచించారు.