KTR : మార్చి 1 నుంచి చలో మేడిగడ్డ కార్యక్రమం

  • Written By:
  • Updated On - February 27, 2024 / 12:49 PM IST

KTR: ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) తెలంగాణ ప్రాంతానికి నీళ్లు ఇవ్వకుండా రైతులను కన్నీళ్లు పెట్టించిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్(ktr)మండిపడ్డారు. వందల కిలోమీటర్ల మేర గోదావరి నది ప్రవహిస్తున్నా సరే తెలంగాణ ప్రాంతం గతంలో ఎడారిగా ఉండేదన్నారు. గతంలో జలయజ్ఞం పేరుతో కాంగ్రెస్ సర్కారు చేపట్టిన కార్యక్రమంపై విమర్శలు గుప్పించారు. ‘జలయజ్ఞం కాదది ధనయజ్ఞం’ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ప్రాంతం గర్జించిందని నాటి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని కేటీఆర్ గుర్తుచేశారు. ఈమేరకు మంగళవారం పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.

ప్రస్తుతం రేవంత్ సర్కారు కూడా అదే తీరులో సాగుతోందని, మేడిగడ్డపై దుష్ప్రచారం చేస్తోందని కేటీఆర్ విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజ్ లో మొత్తం 84 పిల్లర్లు ఉండగా కేవలం 3 పిల్లర్లు మాత్రమే కుంగిపోయాయని కేటీఆర్ చెప్పారు. అయితే, కాంగ్రెస్ నేతలు మాత్రం మొత్తం బ్యారేజ్ కొట్టుకుపోయినట్లు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై ప్రజలకు వాస్తవాలు చూపించేందుకు బీఆర్ఎస్ తరఫున ప్రయత్నిస్తామని వివరించారు. మార్చి 1 నుంచి చలో మేడిగడ్డ(chalo Medigadda) కార్యక్రమం నిర్వహిస్తామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రతినిధులతో మేడిగడ్డతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శిస్తామని, కాళేశ్వరం ప్రాజెక్టు సమగ్ర స్వరూపాన్ని ప్రజలకు చూపెడతామని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

‘అసలు కాళేశ్వరం అంటే ఏమిటీ..? రాష్ట్ర ప్రజలకు ఈ రోజు చెప్పదలచుకున్నాం.. దాంతో పాటు కొందరు తెలిసీ తెలియక మాట్లాడుతున్న వారికి సజీవంగా చూపెట్టాలని మేడిగడ్డకు బయలుదేరి వెళ్తున్నాం. కేసీఆర్‌ నల్లగొండ బహిరంగ సభలోనే స్పష్టంగా చెప్పారు. మీరు వెళ్లడం కాదు.. మేడిగడ్డకు.. అన్నారం వెళ్తాం.. సుందిళ్ల వెళ్తాం.. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు సమగ్ర స్వరూపాన్ని ప్రజలకు అర్థమయ్యేలా సజీవంగా చూపెడతాం. కాళేశ్వరం అంటే మేడిగడ్డ కాదు మూడు బరాజ్‌లు. కాళేశ్వరం అంటే 15 రిజర్వాయర్లు, 21 పంప్‌హౌస్‌లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల ప్రవాహ కాలువలు. కాళేశ్వరం అంటే 141 టీఎంసీల స్టోరేజ్‌ కెపాసిటీ..240 టీఎంసీల వినియోగం. వీటన్నింటి సమగ్ర సమాహారమే కాళేశ్వరం ప్రాజెక్టు’ అని తెలిపారు.

read also : Chandrababu : టీడీపీ సీనియర్లతో చంద్రబాబు ఏం చర్చించారు..?