Ganja Seized: మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలను అదుపు చేసే పోలీసుల వద్దనే గంజాయి దొరికింది. ఈ సంఘటన కమిషనరేట్ పరిధిలో కలకలం రేపింది. కాజీపేట పోలీసు డివిజన్ కరీంనగర్ రోడ్డులోని పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న ఓ కానిస్టేబుల్ జోరుగా గంజాయి దందా సాగిస్తున్నారు. నర్సంపేటకు చెందిన ఈ కానిస్టేబుల్ ఇంట్లో ప్రత్యేక విభాగం పోలీసులు గంజాయి ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆ కానిస్టేబుల్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడు కీలక విషయాలు తెలిసినట్టు సమాచారం. ఆ కానిస్టేబుల్ పని చేస్తున్న పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారు. దాన్ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో ఉంచారు.
ఇక అదే స్టేషన్లో పనిచేస్తున్న ఈ కానిస్టేబుల్ ఎవ్వరికీ తెలియకుండా కొంచెం కొంచెం గంజాయి ఇంటికి తీసుకెళ్లాడు. దాన్ని తన ఇంట్లో దాచిపెట్టి తనకు బాగా తెలిసిన వారి ద్వారా విక్రయించడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే ఆ కానిస్టేబుల్ ఎప్పటిలాగే తనకు తెలిసిన వారికి గంజాయి అమ్మడానికి ఇచ్చాడు. వారు వరంగల్ నుంచి నర్సంపేట వైపు బైక్పై వస్తున్నారు. అదే సమయంలో నర్సంపేట డివిజన్ పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. దీంతో పోలీసులను చూసి గంజాయి తీసుకొస్తున్నవారు పారిపోయేందుకు ప్రయత్నించారు. అనుమానం వచ్చి పోలీసులు వారిని వెంబడించారు. గంజాయి తీసుకొస్తున్న ఇద్దరిలో ఒకరు పోలీసులకు చిక్కాడు. అతని వద్ద ఎండు గంజాయిని పోలీసులు ఆశ్చర్యపోయారు. అతని పోలీసులు విచారించగా కానిస్టేబుల్ నుంచి తీసుకొని వచ్చి విక్రయిస్తున్నట్లు చెప్పాడు. దీంతో ఆ కానిస్టేబుల్ను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నట్టు సమాచారం.
ఇటీవల రాష్ట్రంలో గంజాయి గుప్పుమంటోంది. ఎక్కడి నుంచి వస్తుందో ఏమోగానీ.. యువతను చిత్తు చేస్తోంది. దీంతో రేవంత్ ప్రభుత్వం సీరియస్గా గంజాయి నిర్మూలనపై ఫోకస్ పెట్టింది. పోలీసు శాఖకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. పోలీసులు కూడా పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకొని.. గంజాయి స్మగ్లర్ల ఆటకట్టిస్తున్నారు. క్వింటాళ్ల కొద్ది గంజాయిని స్వాధీనం చేసుకుంటున్నారు.