Site icon HashtagU Telugu

Pakistan : పాకిస్థాన్‌లో బాంబు పేలుడు.. పట్టాలు తప్పిన జాఫర్‌ ఎక్స్‌ప్రెస్

Bomb blast in Pakistan.. Jaffer Express derailed

Bomb blast in Pakistan.. Jaffer Express derailed

Pakistan : పాకిస్థాన్‌లోని సింధ్‌ ప్రావిన్స్‌లో బుధవారం ఉదయం తీవ్ర విషాదకర ఘటన చోటు చేసుకుంది. జకోబాబాద్‌ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై బాంబు పేలుడుతో జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ప్రయాణికులు భయానక అనుభవాన్ని ఎదుర్కొన్నారు. స్థానిక మీడియా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. వివరాల్లోకి వెళ్తే, క్వెట్టా నుంచి పెషావర్‌ వెళ్తున్న జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు బాంబు పేలుడు తీవ్రమైన ప్రమాదాన్ని కలిగించింది. ఐఈడీ (ఇంప్రోవైజ్డ్‌ ఎక్స్‌ప్లోసివ్‌ డివైస్‌) రకం బాంబు ట్రాక్‌పై అమర్చినట్లు అనుమానిస్తున్నారు. పేలుడు కారణంగా ట్రాక్‌లో మూడు అడుగుల లోతైన గుంత ఏర్పడిందని పోలీసులు తెలిపారు. ఈ పేలుడు ధాటికి రైలులోని ఆరు బోగీలు పట్టాలు తప్పాయి. ప్రయాణికుల ప్రాణాపాయం తప్పిందని అధికారులు ప్రకటించినప్పటికీ, కొంతమందికి స్వల్ప గాయాలు అయ్యే అవకాశముందని సమాచారం.

Read Also: Aarya : హీరో ఆర్య నివాసంలో ఐటీ సోదాలు

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నప్పటికీ, పాక్‌ భద్రతా బలగాలు ప్రాంతాన్ని చుట్టుముట్టి సోదాలు కొనసాగిస్తున్నాయి. ఈ దాడి వెనుక ఉగ్రవాద శక్తులే ఉన్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాక్‌లో ఇటీవలి కాలంలో రైల్వేలకు సంబంధించి ఉగ్ర దాడులు పెరిగిన నేపథ్యంలో, ఈ ఘటన మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇటీవలి గతంలోనూ ఇదే జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ వార్తలకెక్కింది. మార్చిలో ఈ రైలు బలోచ్‌ వేర్పాటువాద మిలిటెంట్‌ గ్రూపు చేతిలో హైజాక్‌ చేయబడింది. రైలు లోపలున్న వందలాది మంది ప్రయాణికులను వారు బందీలుగా తీసుకున్నారు. ఆ సమయంలో వారిని రక్షించేందుకు వెళ్లిన పాక్‌ భద్రతా బలగాలపై దాడి జరిగి, ఓ అధికారి ప్రాణాలు కోల్పోయారు. అనంతరం భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్‌ ద్వారా బందీలను విడిపించారు.

ఈ రెండు ఘటనల నేపథ్యంలో జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ భద్రతపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రయాణికుల భద్రతకు సంబంధించిన విధానాలను పాకిస్థాన్‌ రైల్వే శాఖ పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఈ రకమైన దాడులు పాక్‌లో ఆంతరికి భద్రతా వ్యవస్థలో ఉన్న లోపాలను బయటపెడుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక ఈ పేలుడుపై రాజకీయ నేతలు, పౌర సమాఖ్యలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. పాకిస్థాన్‌లో శాంతి స్థాపనకు ముందుగా ఇటువంటి ఉగ్ర చర్యలను అణచివేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read Also: BCCI: ఐపీఎల్ మాజీ జ‌ట్టు దెబ్బ‌.. బీసీసీఐకి భారీ నష్టం?