Bhiksha Mukt Bharat : ‘‘భిక్షా ముక్త్ భారత్’’పై కేంద్ర సర్కారు ఫోకస్ చేసింది. ఇందుకోసం తొలి విడతగా దేశంలోని 30 నగరాలను ఎంపిక చేసింది. ఉత్తరప్రదేశ్లోని అయోధ్య నుంచి అసోంలోని గువహటి వరకు.. మహారాష్ట్రలోని త్రయంబకేశ్వరం నుంచి కేరళలోని తిరువనంతపురం వరకు ఉన్న 30 నగరాలను ఈ పథకం కోసం ఎంపిక చేశారు. ఈ నగరాల్లో భిక్షాటన చేస్తున్న మహిళలు, పిల్లల వివరాలను సేకరించి.. వారికి పునరావాసం కల్పించడంపై మోడీ సర్కారు దృష్టిసారించనుంది. ఈ నగరాల్లో భిక్షగాళ్లు ఎక్కువగా ఉండే హాట్స్పాట్లను గుర్తించి, 2026 నాటికి.. ఆయా చోట్ల బిచ్చగాళ్లు లేకుండా చర్యలు చేపట్టనున్నారు. ఆయా జిల్లాలు, మున్సిపాలిటీల అధికారుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే రెండేళ్లలో ‘‘భిక్షా ముక్త్ భారత్’’ జాబితాలోకి మరిన్ని నగరాలను చేర్చనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. కోజికోడ్, విజయవాడ, మదురై, మైసూరులలో ఇప్పటికే సర్వే(Bhiksha Mukt Bharat) పూర్తయింది.
We’re now on WhatsApp. Click to Join.
మతపరమైన, చారిత్రక, పర్యాటక ప్రాముఖ్యత కలిగిన నగరాల్లో ప్రజలకు జీవనోపాధి కల్పన, వ్యాపారాల ఏర్పాటుకు ‘సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిజ్యువల్ ఫర్ లైవ్లీ హుడ్ అండ్ ఎంటర్ ప్రైజ్’ (SMILE) పథకం ద్వారా సహాయం అందిస్తున్నారు. యాచకులుగా జీవిస్తున్న వారికి ఇకపై ఈ పథకం ద్వారానే సహాయ సహకారాలను అందించాలని కేంద్ర సర్కారు నిర్ణయించింది. 30 నగరాల్లో భిక్షాటన చేస్తున్నట్టు గుర్తించే వారి సమాచారాన్ని నమోదు చేయడానికి, ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడానికి ఫిబ్రవరి నాటికి జాతీయ పోర్టల్, మొబైల్ యాప్ను కేంద్రం ప్రారంభించనుంది. ‘‘భిక్షా ముక్త్ భారత్’’ కోసం 30 నగరాలను ఎంపిక చేయగా 25 నగరాల మున్సిపాలిటీలు, జిల్లా స్థాయి ఉన్నతా ధికారుల నుంచి కార్యాచరణ ప్రణాళికలు కేంద్ర సర్కారుకు ఇప్పటికే అందాయి. కాంగ్రా, కటక్, ఉదయపూర్, కుషినగర్ సహా మొత్తం 5 నగరాల నుంచి ఇంకా కార్యాచరణ ప్రణాళికలు అందాల్సి ఉంది. కార్యాచరణ ప్రణాళికల ఆధారంగా ఆయా జిల్లాలకు కేంద్ర సామాజిక సాధికారికత మంత్రిత్వ శాఖ నిధులు విడుదల చేస్తుంది. యాచకులను ఆ పని మాన్పించేందుకు .. పునరావాసం కల్పించేందుకు ఈ నిధులను వినియోగిస్తారు.