Site icon HashtagU Telugu

Bharat Bandh : రేపు భారత్ బంద్.. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాల పెద్ద ఎత్తున పోరాటం

Bharat Bandh

Bharat Bandh

Bharat Bandh : కేంద్ర ప్రభుత్వ విధానాలపై తీవ్ర అసంతృప్తితో, దేశవ్యాప్తంగా పది ప్రధాన కేంద్ర కార్మిక సంఘాల ఉమ్మడి వేదిక బుధవారం ‘భారత్ బంద్’ రూపంలో సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చింది. కార్మికుల హక్కులు, వేతన భద్రతలు, ఉద్యోగ భద్రత వంటి అంశాల్లో కేంద్రం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపిస్తూ ఈ సమ్మెను చేపడుతున్నారు. సుమారు 25 కోట్ల మంది కార్మికులు, ఉద్యోగులు ఈ ఉద్యమంలో పాల్గొనే అవకాశం ఉందని సంఘాల నేతలు అంచనా వేస్తున్నారు. ఈ సమ్మె నేపథ్యంలో బ్యాంకింగ్, బీమా, రవాణా, పోస్టల్ సేవలు, బొగ్గు గనులు వంటి ముఖ్యమైన ప్రభుత్వ రంగాలు తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశముందని హింద్ మజ్దూర్ సభ నాయకుడు హర్భజన్ సింగ్ సిద్ధూ హెచ్చరించారు. కార్మికుల హక్కులను కాపాడేందుకు సంవత్సరాలుగా నిర్వహిస్తున్న పోరాటానికి ఇది తుది సమరం లాంటిదని ఆయన పేర్కొన్నారు.

Read Also: Himachal Floods : వర్ష విపత్తులో మూగ జీవం చేసిన మహత్తర సేవ ..67 ప్రాణాలకు రక్షణగా నిలిచిన ఓ శునకం

కార్మిక సంఘాల నేతల ప్రకారం, కేంద్ర ప్రభుత్వం కార్మికుల ప్రతినిధులతో సంప్రదింపులు జరపకుండా కీలక నిర్ణయాలు తీసుకుంటోందని, గత ఏడాది కార్మిక శాఖ మంత్రికి సమర్పించిన 17 డిమాండ్లపై ఎలాంటి స్పందన లేదని ఆరోపిస్తున్నారు. కనీసం వార్షిక కార్మిక సదస్సు కూడా నిర్వహించకపోవడం ప్రభుత్వ వైఖరిని ప్రతిబింబిస్తోందని వారు విమర్శిస్తున్నారు. ప్రభుత్వం ఇటీవల పార్లమెంటులో ఆమోదించిన నాలుగు లేబర్ కోడ్‌లు కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నాయని, అవి సంస్థల్లో సామూహిక బేరసారాలకు అడ్డుకట్ట వేస్తాయని, కార్మిక సంఘాల కార్యకలాపాలను అణచివేయడానికే వీటిని రూపొందించారని కార్మిక నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం, ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు విధానాల అమలు వల్ల లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోతున్నాయని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ విధానాలు కార్మికులకు గౌరవప్రదమైన ఉద్యోగ భద్రతను హరిస్తున్నాయని, కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసమే కేంద్రం పనిచేస్తోందని వారు ఆరోపిస్తున్నారు. ఈ సమ్మెకు దేశవ్యాప్తంగా వ్యవసాయ కార్మిక సంఘాల ఉమ్మడి వేదికతో పాటు, సంయుక్త కిసాన్ మోర్చా కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున నిరసనల్లో పాల్గొనబోతున్నారు. ఈ బంద్‌ను రైతు-కార్మిక ఐక్య ఉద్యమంగా మలచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈ సార్వత్రిక సమ్మెకు ముందు కొన్ని నెలలుగా సంఘాలు కార్యాచరణలో నిమగ్నమై ఉండటం గమనార్హం. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించి, వివిధ రంగాల్లోని ఉద్యోగులను చైతన్యవంతం చేశారు. ఏఐటీయూసీ నేత అమర్జీత్ కౌర్ ప్రకారం, ఈ సమ్మెలో 25 కోట్ల మందికి పైగా పాల్గొంటారని అంచనా. దేశ ప్రజల జీవన ప్రమాణాలను ప్రభావితం చేసే విధంగా తీసుకుంటున్న ఆర్థిక, కార్మిక విధానాలను తిరస్కరించేందుకు కార్మికులు, రైతులు కలసికట్టుగా పోరాటానికి సిద్ధమవుతుండటంతో కేంద్రానికి గట్టినెత్తిన హెచ్చరిక ఇది. ఈ బంద్ దేశ వ్యాప్తంగా ప్రభావం చూపించే అవకాశముంది.

Read Also:Harish Rao : మాజీ మంత్రి హరీశ్ రావుకు మరోసారి కాళేశ్వరం కమిషన్‌ నోటీసులు

 

Exit mobile version