Site icon HashtagU Telugu

No Age Bar: 80 లు దాటినా కుర్రాళ్లతో పోటీ.. 14 మాస్టర్ డిగ్రీలు సాధించేశారు

Education

Education

చూడడానికి వాళ్లిద్దరికీ 80లు దాటాయి కాని.. మనసులో మాత్రం కుర్రాళ్లకన్నా పడుచోళ్లు. అందుకే ఒక్క డిగ్రీ చదవడానికే జీవితంలో ఆపసోపాలు పడే అబ్బాయిలు, అమ్మాయిలు.. ఈ ఇద్దరు వృద్ధ యవ్వనుల గురించి తెలుసుకుంటే.. వావ్ అంటారు. అయినా చదవడానికి వయసుతో పనేముంది. చదవాలన్న కోరిక ఉండాలే కాని.. సెంచరీ వయసులో కూడా డిగ్రీల మీద డిగ్రీలు చదివేయచ్చు. పురోహిత్, నింగయ్య బసయ్య లు చేసింది అదే.

ఎస్వీ పురోహిత్ వయసు 80 దాటింది. ఆయన వృత్తి రీత్యా ఓ లాయర్. ఆయనది ఛత్తీస్ గఢ్ లోని బిలాస్‌పుర్‌. అక్కడే హైకోర్టులో అడ్వొకేట్ గా పనిచేస్తున్నారు. జ్యోతిషశాస్త్రంలో ఎంఏ కూడా చేస్తున్నారు. అయినా సరే చదువంటే ఉన్న ఇష్టం పోలేదు. అందుకే చదువుతూనే ఉన్నారు. అలాగని ఒకటీ రెండు కాదు.. ఏకంగా 14 సబ్జెక్టుల్లో మాస్టర్స్ చేసి వావ్.. తాతగారు.. మీరు ఈ వయసులో కూడా.. అని అనిపించుకుంటున్నారు.

SV Purohit

ఎందుకంటే ఆయన.. అనువాదం-ఎడిటింగ్‌, సోషియాలజీ, పొలిటికల్‌ సైన్స్‌, ఇంగ్లిష్‌, హిందీ, ఎల్‌ఎల్‌బీ, మహాత్మా గాంధీ శాంతి పరిశోధనలు, డిప్లొమా ఇన్‌ సైబర్‌ లా, ఎల్‌ఎల్‌ఎం, పీజీ డిప్లొమా ఇన్‌ జర్నలిజంలో మాస్టర్స్ చేసేశారు. అసలీ వయసులో ఇన్ని డిగ్రీలు చదవడమంటే మాటలు కాదు. అయినా సరే.. ఈ స్థాయిలో కష్టపడుతున్న పురోహిత్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

ఇక కర్ణాటకలోని నింగయ్య బసయ్య గురించి చాలా మందికి తెలుసు. ఆయన వయసు 81 ఏళ్లు. ఈ వయసులో ఆయన ఎంఏ ఇంగ్లిష్ చేశారు. ఆయనది విజయపుర జిల్లా. జేఎస్ఎస్ మహా విద్యాలయంలో చదువుకున్నారు. చదువంటే గుండ్రాయి లాగా.. అదో గుదిబండ లాగా ఫీలయ్యే కుర్రాళ్లు వీళ్లను చూసి చాలా నేర్చుకోవాల్సిందే.

Ningayya Basayya

Exit mobile version