Prakash Raj: ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ (Prakash Raj) కేంద్రంలోని అధికార బీజేపీ (BJP)పైతీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘420’లు (మోసానికి పాల్పడినవారు) వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో (Lok Sabha elections) 400 సీట్లు గెలుస్తామని అంటున్నారని, ఇవి అహంకారంతో కూడిన వ్యాఖ్యలని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఒకే పార్టీ 400 కంటే ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. కర్ణాటకలోని చిక్కమంగళూరులో ఆదివారం మీడియాతో ప్రకాశ్ రాజ్ మాట్లాడారు. ప్రధాని మోడీ, బీజేపీ పేరు ప్రస్తావించకుండా తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.
We’re now on WhatsApp. Click to Join.
‘లోక్సభ ఎన్నికల్లో 400 సీట్లు సాధిస్తామని 420లు చెబుతున్నారు. అలా చెప్పే రాజకీయ పార్టీ కాంగ్రెస్ లేదా ఇతర పార్టీ ఏదైనా కావొచ్చు. అలా చెప్పడం అహంకారమే అవుతుంది. ప్రజాస్వామ్యంలో ఒకే పార్టీ 400.. అంతకన్నా ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం లేదు. ప్రజలు ఓటు వేస్తేనే సదరు అభ్యర్థి గెలుస్తారు. అలాంటిది ఓ రాజకీయ పార్టీ, ఆ పార్టీ నేత తమ పార్టీ ఇన్ని సీట్లు గెలుస్తామని ఎలా చెబుతుంది. దీనిని ముమ్మాటికీ అహంకారం అనే అంటారు’ అని ప్రకాశ్ రాజ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
కాగా, కేంద్రంలో వరుసగా రెండు సార్లు అధికారం చేపట్టిన బీజేపీ ఈ సారి కూడా ఎన్నికల్లో విజయం సాధించి అధికారం చేపట్టి హ్యాట్రిక్ కొట్టాలని తహతహలాడుతోంది. ఈ నేపథ్యంలో గెలుపే లక్ష్యంగా ముందుకుసాగుతోంది. ఈ ఎన్నికల్లో ఎన్డీయే 400 కంటే ఎక్కువ సీట్లలో విజయం సాధిస్తుందని ప్రధాని మోదీ సహా కమలం పార్టీ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. 400 సీట్లతో ఎన్డీయే మళ్లీ అదికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
read also: Google Pixel 8a: భారత్లో గూగుల్ పిక్సెల్ 8ఏ ఫోన్ లాంచ్ ఎప్పుడంటే.. ఫీచర్లు ఇవే..!
ఇదే విషయాన్ని ఫిబ్రవరి 5న రాజ్యసభలో ప్రధాని మోడీ కూడా చెప్పిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. ‘కేంద్రంలో మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడటానికి ఇంకా ఎంతో దూరం లేదు. గరిష్టంగా 100-125 రోజులు మిగిలి ఉన్నాయి. ఈ సారి 400 సీట్లు గెలుస్తాం. దేశం మొత్తం ‘అబ్కీ బార్, 400 పార్’ అంటోంది’ అంటూ ధీమా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ పై విధంగా వ్యాఖ్యలు చేశారు.