తొలి రోజుల్లో తడబడిన వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిల క్రమంగా రాటుతేలారు. ఎక్కడికక్కడ స్థానిక నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రజల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మంత్రులతో పాటు ఎమ్మెల్యేలను కూడా ఎవరినీ వదలకుండా వాళ్లు చేసే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను లేవనెత్తుతున్నారు. ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరుగుతోన్న ప్రజాప్రస్థానం పాదయాత్ర సందర్భంగా పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డిని టార్గెట్ చేయడం సంచలనం కలిగిస్తోంది.
గతంలోనూ ఆమె మంత్రి నిరంజన్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారని అసెంబ్లీకి ఫిర్యాదు అందింది. ఆ మేరకు ఆమెను సంజాయిషీ కోసం అసెంబ్లీకి పిలిపించాలని ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. ప్రివిలేజ్ కమిటీకి ఆ బాధ్యతను అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయినప్పటికీ ఆమె ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు. దూకుడుని మరింత పెంచుతూ దూసుకెళుతున్నారు.
Also Read: Telangana Sit:`కమాండ్ అండ్ కంట్రోల్` టెన్షన్!
ఇటీవల పరకాల నియోజకవర్గంలో వైఎస్ విగ్రహాన్ని టీఆర్ఎస్ శ్రేణులు కూల్చాయి. ఆ రోజు నుంచి ధర్మారెడ్డి మీద కసిగా ఉన్న షర్మిల పాదయాత్ర సందర్భంగా నిప్పులు చెరిగారు. అధికారమదంతో వైయస్ఆర్ విగ్రహాన్ని కూల్చాడని విరుచుకుపడ్డారు. బీసీ, దళిత ఉద్యోగుల పట్ల చల్లా ధర్మారెడ్డి మోనార్క్ లా ప్రవర్తిస్తున్నారని ఫైర్ అయ్యారు. అంతేకాదు, ఆయన చేస్తోన్న కాంట్రాక్టుల అంశాన్ని బయట పెట్టారు. అక్షరాల 5వేల కోట్లు సంపాదించాడని ఆరోపిస్తూ ఎమ్మెల్యే ముసుగులో చేసిన కాంట్రాక్టులను ప్రస్తావించారు. ఇసుక, మట్టి మాఫియా నడిపిస్తూ భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆగ్రహించారు.
ప్రొఫెసర్ జయశంకర్ పై గౌరవం ప్రదర్శిస్తున్న కెసీఆర్ ఇప్పటి వరకు ఆయన స్మృతి వనం ఏర్పాటు చేయించలేకపోయారని గుర్తు చేశారు. ఆయన గ్రామానికి మంచినీళ్లు, రోడ్లు కూడా లేకుండా చేశారని సీఎంను టార్గెట్ చేశారు షర్మిల. పోలీసులను జీతగాళ్లుగా వాడుకొని దోపిడీలకు పాల్పడుతోందని ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. బంగారు తెలంగాణ అని పేదవారికి బతుకే లేని తెలంగాణగా మార్చారని వైయస్ షర్మిల మండిపడ్డారు. కెసిఆర్ దొరల ప్రభుత్వం పోవాలని పదునైన వ్యాఖ్యలతో ప్రజల్ని ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే ధర్మారెడ్డిని పరకాల నియోజకవర్గంలో జరుగుతోన్న పాదయాత్రలో టార్గెట్ చేయడం సరికొత్త సంచలనానికి దారితీస్తోంది.
Also Read: CM KCR : వచ్చే నెల కేసీఆర్ ఎన్నికల శంఖారావం?