YS Sharmila: ట్రిపుల్ ఐటీలో 27 మంది ఆత్మహత్య చేసుకున్న దొరకి చలనం లేదు

YS Sharmila: బాసర ట్రిపుల్ ఐటీలో ఇప్పటి వరకు 27 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నా.. బంధిపోట్ల రాష్ట్ర సమితిలో చలనం లేదా అంటూ ఘాటుగా స్పందించారు వైఎస్ఆర్టీపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. తెలంగాణాలో అధికార పార్టీ తప్పుల్ని ఎత్తి చూపుతూ నిత్యం విమర్శలు చేస్తున్న ఆమె తాజాగా విద్యార్థుల సూసైడ్ గురించి మాట్లాడారు. ఈ మేరకు ఆమె సీఎం కేసీఆర్ ని ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశారు.

ఈ విద్యా సంవత్సరంలోనే నలుగురు ప్రాణాలు కోల్పోయినా దొరకు పట్టింపు లేదని విమర్శించారు.ఉన్నత విద్యకు నిలయాలైన ట్రిపుల్ ఐటీలను.. ఆత్మహత్యలకు నిలయంగా మార్చాడు కేసీఆర్ అంటూ మండిపడ్డారు. గొప్ప ఆశయాలతో వచ్చిన పేద విద్యార్థులకు పురుగుల అన్నం, మురుగు నీరు పెట్టి ఆత్మహత్యలకు ఉసిగొల్పుతున్నారని తెలిపారు. సర్కారు నియమించిన డైరెక్టర్లు కేసీఆర్ లాగే డుమ్మాలు కొడుతున్నారు. సిబ్బంది నియామకాలను మరిచారు.. క్యాంపస్ ల నిర్వహణను గాలికొదిలేశారు.. నిధుల కేటాయింపులను గంగలో కలిపేశారు. ఇంచార్జ్ అధికారులు, కాంట్రాక్టు ఉద్యోగులతో పబ్బం గడుపుతున్నారు. ఫొటోలకు ఫోజులిచ్చిన మంత్రులు.. ఇచ్చిన హామీలను గాలికొదిలేశారు.

ఆరు నెలల కింద ఊదరగొట్టే మాటలు మాట్లాడిన తండ్రీకొడుకులు.. మరునాడే పత్తా లేకుండా పోయారు. పేద బిడ్డలకు ఉన్నత విద్య అందించాలని వైయస్ఆర్ గారు ట్రిపుల్ ఐటీలను స్థాపిస్తే.. కేసీఆర్ మాత్రం ట్రిపుల్ ఐటీలపై నమ్మకమే లేకుండా చేస్తున్నారు. వైయస్ఆర్ హయాంలో ట్రిపుల్ ఐటీలో సీటు కోసం పోటీ పడిన విద్యార్థులు.. ఇప్పుడు సీటు కోసం అప్లై చేసుకోవడం కూడా మానేశారు. కేసీఆర్ దిక్కుమాలిన పాలన వల్ల పేద బిడ్డలకు ఉన్నత విద్య అందకపోగా.. ప్రాణాలు కోల్పోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ట్రిపుల్ ఐటీల్లో ఆత్మహత్యలపై దర్యాప్తు కమిటీని నియమించాలని YSR తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తోంది. మరో విద్యార్థి ప్రాణం పోకముందే సర్కారు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆమె డిమాండ్ చేశారు.

Read More: HMDA Artificial Demond : జ‌నం భూములు కేసీఆర్ ఇష్టం.! వేలంలో కృత్రిమ డిమాండ్!!