YS Sharmila: అమరుల ప్రాణ త్యాగం దొరకు దక్కిన అధికార వైభోగం

తెలంగాణ అధికార పార్టీకి చంద్రముఖిలా తయారయ్యారు వైఎస్ఆర్టీపి పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. మంచైనా, చెడైనా.. మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదంటున్నారు షర్మిల.

YS Sharmila: తెలంగాణ అధికార పార్టీకి చంద్రముఖిలా తయారయ్యారు వైఎస్ఆర్టీపి పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. మంచైనా, చెడైనా.. మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదంటున్నారు షర్మిల. గత కొంత కాలంగా షర్మిల వైఖరి కేవలం అధికార పార్టీని ఎండగట్టడమే అన్నట్టుగా మారింది. ఇక ఈ రోజు గురువారం వైఎస్ షర్మిల సీఎం కెసిఆర్, అధికార పార్టీపై విమర్శల వర్షం కురిపించింది. షర్మిల ట్విట్టర్ లో సీఎం కెసిఆర్ పై అనేక విమర్శలకు పాల్పడ్డారు.

అమరుల ప్రాణ త్యాగం – దొరకు దక్కిన అధికార వైభోగమన్నారు షర్మిల. రాష్ట్ర సాధనకై ప్రాణాలను పణంగా పెట్టిన వారు ఎందరో అయితే..ఆ ఫలాలను అందరికీ దక్కకుండా చేసిన ఉద్యమ ద్రోహి కేసీఆర్ మాత్రమేనని విమర్శించారు. అసువులు బాసిన అమరుల ఆశయాలు గోదారి పాలైతే .. స్వరాష్ట్ర సంపద అంతా కేసీఆర్ పాలయ్యేనన్నారు. నిధులు మింగే, నీళ్ళు ఎత్తుకు పోయే, ఉద్యోగాలు ఇంట్లనే ఇచ్చుకునే. త్యాగాల మీద, రక్తపు చుక్కలపై పీఠం ఎక్కిన దొర.. అమరుల కుటుంబాలను ఆద మరిచిండు. ఇన్నాళ్లు వాళ్ళెవరో అన్నట్లు, గుర్తుకు లేనట్లు నాటకాలు ఆడిండు. ఉన్నట్లుండి 9 ఏళ్లుగా లేని ప్రేమ ఎన్నికల వేల మళ్లీ పుట్టుకొచ్చే అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

అమరుల ప్రాణత్యాగం వెలకట్టలేనిది అంటూ కుండపోతగా ప్రేమను కురిపించే పన్నాగం పన్నుతున్నడు. ఎన్నికల్లో ఓడిపోతామనే సంకేతాలతోనే అమరవీరులు మళ్ళీ యాదికొచ్చారు. రాష్ట్ర సాధనకై 15 వందల మంది ప్రాణాలు కోల్పోతే.. వారి పేర్లు కూడా తెలుసుకోలేని దిక్కుమాలిన సర్కారు ఇది. 1200 మంది అమరవీరులయ్యారని సొంత లెక్కలు బయటపెట్టిన కేసీఆర్.. ఆదుకున్నది 528 మందిని మాత్రమే. మిగిలిన 700 మంది అమరుల త్యాగాలను,

చరిత్రను చెరిపేసే ప్రయత్నం చేసిండు. ఇల్లు, ఉద్యోగం, భూమి ఇస్తానని చెప్పి వెన్నుపోటు పొడిచిన దుర్మార్గుడు కేసీఆర్. అమరుల పేర్లు సువర్ణాక్షరాలతో లిఖిస్తనని చెప్పి కుటుంబాన్ని బంగారం చేసుకున్నడే తప్పా వారి పేర్లు ఎక్కడా చెక్కలే. ఇన్నాళ్లు గుర్తుకు రాని శంకరమ్మకు పిలిచి MLC ఇస్తాడట. కొత్తగా అమరులకు న్యాయం చేస్తాడట. ఉద్యమాన్ని అణగదొక్కిన ఉద్యమద్రోహులను అక్కున చేర్చుకొని తెలంగాణ తల్లికి ఆత్మఘోష రగిల్చిన మారీచుడు ఈ కేసీఆర్. ఏడాదిలోనే ప్రగతిభవన్ కోటలు కట్టుకున్న దొరకు..అమరవీరుల స్మారక చిహ్నం పూర్తి కావడానికి మాత్రం తొమ్మిదేండ్లు పట్టింది! కేసీఆర్ లాంటి ఉద్యమద్రోహులు అమరవీరుల స్మారక స్థూపం ఆవిష్కరించడం అంటే అమరవీరులను, తెలంగాణ సమాజాన్ని అవమానించినట్టేనని పేర్కొన్నారు షర్మిల.

Read More: CM KCR: సంగారెడ్డి నుంచి హయత్‌నగర్ మెట్రో వ‌స్తుంద‌ని హామీ ఇచ్చిన‌ కేసీఆర్‌.. కానీ, ఒక్క ష‌ర‌తు