Hyderabad: హైదరాబాద్లో టిఎస్ఆర్టిసి సిటీ బస్సు కండక్టర్లపై దాడులు కొనసాగుతున్నాయి.తాజాగా మరో ఘటన హైదరాబాద్లో వెలుగు చూసింది. బస్సును ఆపాలని కోరిన చోట ఆగకపోవడంతో ఓ మహిళా బస్సు కండక్టర్పై దాడి చేసింది. చెప్పుతో అతనిని విచక్షణారహితంగా కొట్టింది. మహిళలకు ఉచితంగా బస్సులు ఎందుకు నడుపుతున్నారంటూ కండక్టర్ను బూతులు తిట్టింది. మెహిదీపట్నం నుంచి ఉప్పల్ వెళ్లే రూట్ నంబర్ 300లో ఈ అవాంఛనీయ ఘటన చోటుచేసుకుంది.
మహిళ శివరాంపల్లికి చెందిన ప్రసన్నగా గుర్తించారు. తోటి ప్రయాణికులు ఆమెను అడ్డుకుని బస్సును రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. బస్సు పీఎస్ వద్ద ఆగగానే ఆమె అక్కడి నుంచి పరారైంది. కండక్టర్ ఫిర్యాదుతో రాజేంద్రనగర్ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జనవరి 25 తెల్లవారుజామున హయత్నగర్ డిపో కండక్టర్పై మరో మహిళ దాడి చేసింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కండక్టర్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీన్ని సీరియస్గా తీసుకున్న ఆర్టీసీ అధికారులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.
టిఎస్ఆర్టిసి ఎండి సజ్జనార్ ఈ తరహా ఘటనలపై సీరియస్ యాక్షన్ తీసుకుంటామని ఇప్పటికే ప్రకటించారు. ఆవేశంలో దాడులకు దిగి జైలు పాలు కావొద్దని సూచించారు. అయినా సిబ్బందిపై దాడులు ఆగడం లేదు. ఈ లోపే తాజాగా మెహిదీపట్నంలో ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.
Also Read: Akashdeep singh: టీమిండియా టెస్టు జట్టులోకి కొత్త బౌలర్.. ఎవరీ ఆకాశ్ దీప్..?