చేవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పాక.. ఆయన ఏ పార్టీలో చేరుతారనే విషయమై ఎన్నో ఊహాగానాలు మొదలయ్యాయి. ఆయన తిరిగి కాంగ్రెస్ లో చేరుతారా.. లేక బీజేపీ చేరుతారనేదీ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది. ఈ నేపథ్యంలో కొండా విశ్వేశ్వరెడ్డి బీజేపీలో చేరేందుకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. BJP రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్, బండి సంజయ్ తో దాదాపు 45 నిమిషాలు కొండా భేటీ అయినట్టు సమాచారం.
సమావేశంలో డైరెక్ట్ గా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో మాట్లాడించారు రాష్ట్ర నేతలు. మంచి రోజు చూసుకొని రేపు లేదా… ఎల్లుండి నడ్డా సమక్షంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. బీజేపీలోకి చేరాలని తరుణ్ చుగ్, సంజయ్ తన ఇంటికి వచ్చి కోరారని కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లోనే జాయిన్ కావాలా తర్వాత జాయిన్ కావాలా అనే విషయంపై ఆలోచిస్తున్నానని చెప్పారు. 2013లో కేసీఆర్ ఆహ్వానం మేరకు టీఆర్ఎస్లో చేరిన కొండా విశ్వేశ్వరరెడ్డి.. 2018లో టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరారు. కిందటి ఏడాది మార్చిలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.
అయితే రేవంత్రెడ్డి టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విశ్వేశ్వర్ రెడ్డితో సమావేశమయ్యారు. ఆ సమయంలో మళ్లీ తిరిగి కాంగ్రెస్ గూటికి తిరిగి చేరుతారని ప్రచారం జరిగింది. కానీ విశ్వేశ్వర్రెడ్డి మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే హుజురాబాద్ ఉప ఎన్నిక సమయంలో కొండా ప్రత్యేకంగా ఈటల రాజేందర్ ను కలుసుకొని తన మద్దతు తెలిపాడు. ఈటల ప్రోద్బలంతోనే కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. ఒకవేళ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కమలం గూటికే చేరితే.. మోడీ, అమిత్ షా ల సమక్షంలో బీజేపీ చేరడం ఖాయమే.