తెలుగు రాష్ట్రాల్లో మరోసారి క్యాసినో వ్యవహరం దుమారం రేగుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని క్యాసినో డీలర్లలో ఒకరైన చికోటి ప్రవీణ్ మాట్లాడుతూ.. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు తన ఇంటిపై దాడి చేసి తనకు నోటీసులు అందజేశారని చెప్పారు. గురువారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. ఈడీ నోటీసుకు సోమవారం సమాధానం ఇస్తానని పేర్కొన్నారు. గోవా, నేపాల్లో క్యాసినో నిర్వహించడం చట్టబద్ధమైనదని ప్రవీణ్ అన్నారు.
హవాలా లావాదేవీలపై ప్రశ్నించగా.. మీడియాకు కాకుండా ఈడీకి సమాధానం ఇస్తానని చెప్పారు. అయితే ఆయన ఇంట్లో ఈడీ మొబైల్స్ లేదా ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నారా అనే ప్రశ్నకు చికోటి స్పందించలేదు. హైదరాబాద్కు చెందిన ప్రవీణ్, మాధవరెడ్డితో పాటు మరికొంతమంది నేపాల్, బంగ్లాదేశ్, ఇండోనేషియా, గోవాలోని క్యాసినోలకు భారత్లోని వీఐపీలను ఆహ్వానించినట్లు ఈడీ గుర్తించింది. ప్రవీణ్, ఇతర వ్యక్తులు నిర్వహించే కాసినోలకు VIPలను ఆకర్షించడంలో సినీ ప్రముఖుల పాత్రను కూడా ఈడీ పరిశీలిస్తోంది. విచారణలో మరిన్ని వివరాలు తెలుస్తాయి.