మునుగోడు ఉప ఎన్నికలకు ముందు తెలంగాణలో రాజకీయ వేడి రాజుకుంటోంది. రాబోయే ఉప ఎన్నికల్లో విజయం సాధించాలని అధికార టిఆర్ఎస్, ప్రతిపక్ష పార్టీలు వ్యూహాత్మకంగా కదులుతున్నాయి. ఉప ఎన్నికలకు ముందే అసెంబ్లీని రద్దు చేయాలని టీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు (కేసీఆర్) యోచిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
సెప్టెంబర్ 3న సీఎం కేసీఆర్ కేబినెట్ సమావేశం, టీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరగనున్న నేపథ్యంలో.. ఈ భేటీ తర్వాత సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకోనున్నారనే అనుమానాలు రాజకీయంగా వినిపిస్తున్నాయి. అలాగే సామాజిక సంక్షేమ పథకాలపై మంత్రులు, అధికారులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారని చెబుతున్నారు. ముందుగా అసెంబ్లీ రద్దుకు సిద్ధమని సీఎం కేసీఆర్ ప్రకటించే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రేపు టీఆర్ఎస్ఎల్పీ సమావేశం కాబోతుండటంతో టీఆర్ఎస్ నాయకులతోపాటు ఇతర పార్టీల నేతలు సైతం కేసీఆర్ ఏం నిర్ణయం తీసుకుంటారు? అనేది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.