Casino ED Raids: ఎవ‌రీ చికోటి ప్ర‌వీణ్‌, మాధ‌వ‌రెడ్డిలు?

ఎవ‌రీ చికోటి ప్ర‌వీణ్ ? ఆయ‌న పార్ట‌న‌ర్ మాధ‌వ‌రెడ్డి ఎవ‌రు? అనే దానిపై గుగూల్ అన్వేష‌ణ పెరిగింది. రెండు రాష్ట్ర ప్ర‌భుత్వాల‌నే కాదు, కొంద‌రు మంత్రుల జీవితాల‌ను బ‌స్టాండ్‌కు ఈడ్చే మాదిరిగా ఉన్న వాళ్ల జీవితాలను తెలుసుకుంటే క‌ళ్లు బైర్లు క‌మ్మే విష‌యాలు వెలుగుచేస్తున్నాయి.

  • Written By:
  • Updated On - July 29, 2022 / 03:06 PM IST

ఎవ‌రీ చికోటి ప్ర‌వీణ్ ? ఆయ‌న పార్ట‌న‌ర్ మాధ‌వ‌రెడ్డి ఎవ‌రు? అనే దానిపై గూగుల్ అన్వేష‌ణ పెరిగింది. రెండు రాష్ట్ర ప్ర‌భుత్వాల‌నే కాదు, కొంద‌రు మంత్రుల జీవితాల‌ను బ‌స్టాండ్‌కు ఈడ్చే మాదిరిగా ఉన్న వాళ్ల జీవితాలను తెలుసుకుంటే క‌ళ్లు బైర్లు క‌మ్మే విష‌యాలు వెలుగులోకి వస్తునాయి.  విలాస‌వంత‌మైన వాళ్ల జీవితం చూస్తే మూడు ముక్క‌ల సామ్రాజ్యం విలువ ఎంటో బోధ‌ప‌డుతోంది. వాళ్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లోకి తొంగిచూస్తే ఖ‌రీదైన విలాసం కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తుంది.

ప్ర‌స్తుతం చికోటి కుటుంబం ఐఎస్‌ సదన్‌ డివిజన్‌ వినయ్‌నగర్‌ కాలనీలోని సాయికిరణ్‌ రెసిడెన్సీ అపార్ట్‌మెంట్‌లో ఉంది. కడ్తాల్‌లోని ఫామ్‌హౌస్‌లో ఓ ప్రైవేట్‌ జూ ఉంది. కోట్లు విలువ చేసే గుర్రాలతో పాటు, మాట్లాడే చిలుకలు, కొండచిలువలు, ఆస్ర్టిచ్ పక్షులు ఇలా ప‌లు రకాల జంతువులు, పక్షులను పెంచుతున్నాడు. పెంచుకుంటున్న కొండచిలువలతో ఆడుకుంటాడు. ఆస్ర్టిచ్‌ పక్షులతో కాలక్షేపం చేస్తాడు. కోట్ల విలువ చేసే గుర్రాలతో పరుగులు పెడతాడు. ఊసరవెల్లులను భుజంపై వేసుకొని జో కొడతాడు. పాములతో సావాసం చేస్తాడు. అత‌ని రేంజ్‌రోవర్‌ కారు డ్యాష్‌ బోర్డుపై కొండచిలువ పాకుతుందంటే, ప్రవీణ్‌ క్యారెక్టర్‌ ఎంత వైల్డో అర్థమవుతోంది. ప్రవీణ్‌ లైఫ్ వైల్డా అని జనం నోరెళ్లబెట్టాల్సిందే. ఫామ్‌హౌస్‌లో కోట్ల విలువైన గుర్రాలు, మాట్లాడే చిలుకలు, కొండచిలువలు, ఆస్ర్టిచ్ పక్షులతో ఎంజాయ్ అత‌ని లైఫ్ స్టైల్, లగ్జరీ కార్లల్లో షికార్లు, ఎక్కడికెళ్లినా వెంట ఉండే ప్రైవేట్‌ సైన్యం ఇవి ప్ర‌వీణ్ చికోటీ లగ్జరీలో ఓ పార్ట్. ఆయన లైఫ్‌ స్టైల్‌ చూసిన వాళ్లేవరైనా వావ్‌ అనాల్సిందే.

ప్ర‌స్తుతం క్యాసినో నిర్వాహ‌కుడిగా అంద‌రూ చూస్తోన్న చికోటి ప్ర‌వీణ్ ఒక‌ప్పుడు ప‌త్తాలాండించే వ్యక్తి. పొలిటికల్ అండదండల్ని పుష్క‌లంగా సంపాదించాడు. ఇంకేముంది హైరేంజ్‌ లైఫ్ స్టైల్, లగ్జరీ మెయింటెన్స్ కి అల‌వాటు ప‌డ్డారు. ఒళ్లు గగుర్పొడిచేలా పాములు, కొండచిలువలు, ఊసరవెల్లితో సావాసాలు చేసే ప్రవీణ్‌ లైఫ్ చీకటి కోణాల వెనుకున్న అసలు స్టోరీ రెండు ముక్క‌ల్లో గల్లీ నుంచి ఇంటర్నేషనల్ గ్యాంబ్లర్ లా ఎదిగాడు.

హైదరాబాద్‌, సైదాబాద్‌లోని వినయ్‌ నగర్‌ కాలనీ లో 20 ఏళ్ల క్రితం చీకోటి ప్రవీణ్ చిన్న సిరామిక్‌ టైల్స్‌ వ్యాపారి. ఆ తర్వాత నిర్మాతగా మారి సినిమా తీశాడు. విలన్‌గా నటించి దివాలా తీశాడు. అప్పుల ఊబిలో చిక్కుకుపోయి దాన్నుంచి బయటపడేందుకు వనస్థలి పురంలో ఒక డాక్టర్‌ను కిడ్నాప్‌ చేశాడు. ఆ కేసులో జైలుకు వెళ్లొచ్చాడు. ఆ తర్వాత గోవాలో ఓ పేకాట క్లబ్బులో కొన్ని టేబుళ్లలను అద్దెకు తీసుకుని పేకాట నిర్వహించేవాడు. అంచెలంచెలుగా క్యాసినో సామ్రాజ్యాన్ని విస్తరించాడు. అలా కోట్లకు పడగలెత్తాడు చికోటి ప్రవీణ్‌.

మొదట బేగంపేట, వనస్థలి పురం, సికింద్రాబాద్, జూబ్లీహిల్స్‌ ప్రాంతాల్లో సెలబ్రిటీల కోసమే క్యాసినోలు ఏర్పాటు చేసి దందా సాగించేవాడు. చిన్న చిన్న పార్టీలతో అత‌ని బిజినెస్ మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. పొలిటీషియన్స్‌తో ఉన్న పరిచయాలతో 2014 తర్వాత చికోటి ప్రవీణ్‌ బిజినెస్ టర్న్ అయింది. చీకటి వ్యాపారాన్ని ఏకంగా ఫారిన్‌కు విస్తరించాడు. ఈ చీకటి బాగోతంలో ప‌లువురు ఏపీ, తెలంగాణ మంత్రులు ఉన్నార‌ని ప్రచారం జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని 16 మంది ఎమ్మెల్యేలు, DCCB ఛైర్మన్లు సైతం కస్టమర్ల లిస్ట్‌లో ఉన్నార‌ట‌. వాళ్ల‌ సాన్నిహిత్యం, సహకారంతోనే చికోటి వ్యవహారం విదేశాలకు విస్తరించింది. ప్రత్యేక విమానాల్లో ఇండోనేషియా, నేపాల్‌కు తీసుకెళ్లి కోట్లలో పేకాట ఆడించడం వరకు వెళ్లాడు.

ఎంతో హైక్లాస్‌గా గడిపే ప్రవీణ్‌ వెంట అనునిత్యం ఓ ప్రైవేట్‌ సైన్యమే ఉంటుంది. సికింద్రాబాద్‌ మహాంకాళి బోనాలకు వెళ్లిన ప్రవీణ్‌ వెంట గన్‌లతో ఉన్న బాడీ గార్డ్స్‌ ఉన్నారంటే మనోడి రేంజ్‌ ఏంటో తెలుసుకోవ‌చ్చు. ఇటీవల కర్మాన్‌ ఘాట్‌లో నిర్వహించిన ఆయన బర్త్‌డే వేడుకలు `నభూతో నభవిష్యతి` అన్న రేంజ్‌లో జరిగాయట. ఈ బర్త్‌డే పార్టీలో అంద‌రూ సెలబ్రిటీలే పాల్గొన్నారు. బర్త్‌డే సందర్భంగా తాను ఇష్టపడి బుక్‌ చేసుకున్న రేంజ్‌ రోవర్‌ ఆటో బయోగ్రఫీ కారును సొంతం చేసుకున్నాడు ప్రవీణ్‌. క్యాసినో కింగ్‌ మేకర్‌గా ఉన్న చికోటి గతంలో అనేకసార్లు పోలీసులకు పట్టుబడిన సందర్భాలున్నాయి. 2017లో హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో పేకాట ఆడిస్తూ పోలీసులకు చిక్కాడు. ఈ ఏడాది సంక్రాంతికి గుడివాడలో క్యాసినో నిర్వహించింది కూడా ప్రవీణే. గుడివాడ క్యాసినోతో అప్పట్లో రాజకీయ దుమారమే రేగింది.

ప్ర‌స్తుతం ఈడీ కేసును ఎదుర్కొంటోన్న చికోటి ప్రవీణ్‌ పార్ట్నర్ మాధవరెడ్డి ప్రస్థానం పాలు, పెరుగు అమ్ముకునే స్థాయి నుంచి ప్రారంభమైంది. ఆ తర్వాత క్రికెట్‌ బెట్టింగులకు పాల్పడి లక్షల రూపాయలు కోల్పోయాడు. ఆ సమయంలో కొంతమంది పొలిటికల్ లీడర్స్‌, చికోటి ప్రవీణ్‌తో పరిచయం క్యాసినో సామ్రాజ్య విస్తరణకు దారితీసింది. ఇటీవల బోనాల పండుగలో మాధవరెడ్డి ఒంటిపై దాదాపు కిలో బంగారంతో ఆభరణాలు కనిపించడంతో అక్కడున్న వారు షాక్ అయ్యారు. మాధవరెడ్డికి రక్షణగా బౌన్సర్లనే పెట్టుకున్నాడంటే క్యాసినో మాస్టర్ మైండ్ రేంజ్‌ ఏంటో అర్థం చేసుకోవచ్చు. మొత్తంమీద ఈడీ రంగ ప్రవేశంతో చికోటి ప్రవీణ్‌, మాధవరెడ్డి వ్య‌వ‌హారం తెలుగురాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.