White Paper on Irrigation : నీటిపారుదల రంగం (ఇరిగేషన్)పై తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ శ్వేతపత్రం విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాల్లో జరిగిన లోపాలపై సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈసందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. గత ప్రభుత్వం చేసిన అక్రమాలన్నీ వెలుగు చూసేలా శ్వేతపత్రం ఉండాలని రేవంత్ సర్కార్ నిర్ణయించిన నేపథ్యంలో 2014 నుంచి 2023 వరకు చేపట్టిన ప్రాజెక్టులు అన్నింటిని శ్వేతపత్రంలో ప్రస్తావించనున్నారు. వాస్తవానికి శుక్రవారం రోజు సాయంత్రమే అసెంబ్లీలో పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి ఏర్పాట్లు జరిగాయి. సాయంత్రం 5:51 గంటలకు సభ ప్రారంభమైన వెంటనే ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య మాట్లాడుతూ.. సభలో సాగునీటిరంగంపై సుదీర్ఘ చర్చ జరగాల్సిన అసవరం ఉందన్నారు. సభను శనివారానికి వాయిదా వేయాలని స్పీకర్ను ఆయన కోరారు. దీన్ని బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు తప్పుబట్టారు. ఇటీవలే అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు వెళ్లొచ్చారు. సీఎం హోదాలో రేవంత్రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించారు. ఈనేపథ్యంలో అసెంబ్లీలో ప్రవేశపెడుతున్న వైట్ పేపర్ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
ఎన్నికలు సమీపించిన ప్రస్తుత తరుణంలో నీటి ప్రాజెక్టుల అంశంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పైచేయి సాధించే ప్రయత్నాలు చేస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించిందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. అయితే కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించలేదని కాంగ్రెస్ సర్కార్ చెబుతోంది. తెలంగాణ అసెంబ్లీలో ఈ విషయమై తీర్మానం కూడ చేసింది. ఈ తీర్మానానికి అన్ని పార్టీలు మద్దతు ప్రకటించాయి. కృష్ణా నదిపై ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తే రాష్ట్రానికి నష్టమని బీఆర్ఎస్ వాదిస్తోంది. అయితే కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను గత ప్రభుత్వమే కేటాయించిందని అసెంబ్లీలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి కాంగ్రెస్ సర్కార్ అప్పగించడాన్ని నిరసిస్తూ నల్గొండ వేదికగా రెండు రోజుల క్రితం బీఆర్ఎస్ ఇటీవల బహిరంగ సభను నిర్వహించింది. రాష్ట్రానికి నీటి కేటాయింపుల విషయంలో అన్యాయం చేస్తే ఊరుకోబోమని కేంద్రానికి కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు.
We’re now on WhatsApp. Click to Join
మరోవైపు తెలంగాణ రాష్ట్ర సాగునీటి రంగంపై శ్వేతపత్రాన్ని(White Paper on Irrigation) శుక్రవారమే విడుదల చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. రాత్రి 11 గంటలు అయినా సభలో చర్చిండానికి తాము సిద్దమన్నారు. తాము పూర్తిగా సన్నద్ధమై వచ్చామని పేర్కొన్నారు. దీనికి విప్లు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి సహకరించాలన్నారు. శనివారం ఢిల్లీలో తమ పార్టీ నేషనల్ కౌన్సిల్ మీటింగ్ ఉందని బీజేపీ పక్షనేత ఎ.మహేశ్వర్రెడ్డి సభకు తెలిపారు.ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేలు ఢిల్లీకి పోయారని చెప్పారు. కాళేశ్వరం అవినీతిపై సీబీఐతో విచారణ చేయించాలని ఆయన కాంగ్రెస్ సర్కారును డిమాండ్ చేశారు.