Whats Today : కామారెడ్డి నియోజకవర్గం నుంచి పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఇవాళ మధ్యాహ్నం 1.30 గంటలకు నామినేషన్ వేయనున్నారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చేతుల మీదుగా ఆయన నామినేషన్ పత్రాలను అధికారులకు సమర్పించనున్నారు. ఈసందర్భంగా జిల్లాకేంద్రంలో బీసీ డిక్లరేషన్ సభను నిర్వహించనున్నారు. దీనికి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ముఖ్య అతిథిగా హాజరవుతారు.
We’re now on WhatsApp. Click to Join.
- తెలంగాణ శాసన సభ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు ఇవాళ చివరి తేదీ. మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల గడువు ముగియనుంది. గురువారం వరకు 1,129 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇవాళ చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది.
- ఇవాళ మెదక్ జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటిస్తారు. నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు.
- ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ నిర్మల్లో పర్యటిస్తారు. బీజేపీ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి నామినేషన్ దాఖలు కార్యక్రమానికి వారు హాజరవుతారు.
- ఈరోజు కొమరంభీం జిల్లాలో బండి సంజయ్ పర్యటిస్తారు. సిర్పూర్ టి మండల కేంద్రంలో బీజేపీ విజయ సంకల్ప సభలో ఆయన ప్రసంగిస్తారు.
- ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో టీడీపీ చీఫ్ చంద్రబాబు దాఖలు చేసిన ప్రధాన బెయిల్ పిటిషన్పై శుక్రవారం హైకోర్టు విచారణ జరపనుంది. ఈకేసులోని మిగితా నిందితులందరికీ ఇప్పటికే రెగ్యులర్, ముందస్తు బెయిల్స్ వచ్చాయి.
- ప్రపంచకప్లో భాగంగా శుక్రవారం అహ్మదాబాద్లోజరిగే కీలక మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ టీమ్ సౌతాఫ్రికాతో తలపడనుంది. సెమీ ఫైనల్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే అఫ్గాన్ ఈ మ్యాచ్లో భారీ విజయాన్ని సాధించాల్సి ఉంది. మధ్యాహ్నం 2 గంటలకు అహ్మదాబాద్ వేదికగా మ్యాచ్ ప్రారంభం అవుతుంది.
- ‘ప్రశ్నకు నోటు’ అంశంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై దర్యాప్తు జరిపిన లోక్సభ ఎథిక్స్ కమిటీ 500 పేజీలతో కూడిన నివేదికను ఇవాళ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించనుంది.
- ఆంధ్రప్రదేశ్లోని చాలా ప్రాంతాల్లో ఇవాళ వర్షాలు పడే అవకాశం ఉంది. అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
- దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యతను పెంచేందుకు క్లౌడ్ సీడింగ్ ద్వారా కృత్రిమ వర్షాలను కురిపించే ప్రతిపాదనతో ఢిల్లీ ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టులో పిటిషన్(Whats Today) వేయనుంది.