Site icon HashtagU Telugu

BCs reservation : బీసీ రిజర్వేషన్ల అమలుకు మా వద్ద 3 మార్గాలు : సీఎం రేవంత్‌రెడ్డి

We have 3 ways to implement BC reservations: CM Revanth Reddy

We have 3 ways to implement BC reservations: CM Revanth Reddy

BCs reservation : తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు కోసం ప్రభుత్వం అన్ని విధాలుగా పోరాటం చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం నాడు ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సీఎం, ఈ బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొందేలా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నామని తెలిపారు. రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ కోసం గురువారం సాయంత్రం వరకు వేచి చూస్తామని వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి, ఆమె స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నామని చెప్పారు. అయితే ఆమె అపాయింట్‌మెంట్ ఇవ్వకపోతే అది ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఒత్తిడి వల్లేనని భావించాల్సి ఉంటుందన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు తమ వద్ద మూడుమార్గాలున్నాయని సీఎం వివరించారు.

రిజర్వేషన్ల అమలుకు మూడుమార్గాలు

ప్రథమ మార్గం: గత ప్రభుత్వ హయాంలో 50 శాతం రిజర్వేషన్ సీలింగ్‌ను దాటి తెచ్చిన చట్టాన్ని పక్కన పెట్టి జీవో (ప్రభుత్వ ఉత్తర్వు) ఇవ్వడం. కానీ జీవో ఇచ్చిన వెంటనే ఎవ్వరైనా కోర్టుకు వెళ్లినట్లయితే స్టే వచ్చే అవకాశముందని, దీంతో ఎన్నికలు నిలిచిపోతాయని ఆయన వివరించారు. అందువల్ల ఈ మార్గం సురక్షితమేగా సాధ్యపడదన్నారు.

రెండవ మార్గం: ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా నిలిపివేయడం. అయితే ఈ దశలో ఎన్నికలు ఆపితే కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులు ఆగిపోతాయని, తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ వ్యవస్థలు కుప్పకూలే ప్రమాదం ఉందని సీఎం హెచ్చరించారు.

మూడవ మార్గం: ప్రత్యామ్నాయంగా, పార్టీ స్థాయిలో బీసీలకు 42 శాతం సీట్లు కేటాయించడం. దీన్ని ఇతర పార్టీలపై ఒత్తిడి తెచ్చే విధంగా కూడా తీసుకెళ్లనున్నామని ఆయన స్పష్టంచేశారు. ప్రతి రాజకీయ పార్టీ బీసీలకు సముచిత ప్రతినిధ్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు.

రాజకీయ సమీకరణాలపై దృష్టి

తెలంగాణలో బీసీలు అనేక రంగాల్లో వెనుకబడి ఉన్నారు. వారి సమస్యలు పరిష్కరించాలంటే రాజకీయాల్లో వారికి సరైన ప్రాతినిధ్యం కల్పించాల్సిందే. 42 శాతం రిజర్వేషన్ బిల్లు రాష్ట్రంలో సామాజిక న్యాయానికి మార్గం వేయనుంది. ఇది ఒక్కబిల్లు కాదు, సామాజిక సమతుల్యత కోసం జరుగుతున్న ఉద్యమం అని పేర్కొన్నారు.

రాష్ట్రపతి నిర్ణయం కీలకం

రాష్ట్రపతి నిర్ణయం ఈ వ్యవహారంలో కీలకం కానుందని సీఎం అభిప్రాయపడ్డారు. రాష్ట్రపతిని కలవాలనే ఉద్దేశంతో ఢిల్లీకి వచ్చాం. ఆమె నుండి అపాయింట్‌మెంట్ కోసం చివరి వరకు ప్రయత్నిస్తాం. ఈ బిల్లు ఆమోదం పొందితే బీసీలకు రాజకీయ స్థాయిలో మరింత శక్తి లభిస్తుంది అని ఆయన వివరించారు.

కేంద్రంపై దృష్టి

బీసీల రిజర్వేషన్ అంశంలో కేంద్రం పాత్రను ప్రశ్నించిన సీఎం, రాష్ట్రానికి న్యాయం చేయాలంటే కేంద్రం సహకారం తప్పనిసరి అని అన్నారు. రాష్ట్రపతి నిర్ణయం ప్రధాని మోడీ చేతుల్లో ఉందని భావిస్తున్నాం. దేశంలోనే తొలి సారి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోసం తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Read Also: TCS : టీసీఎస్‌ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. సెప్టెంబరు 1 నుంచి వేతనాల పెంపు..!